Corona Virus : కరోనా మళ్లీ ప్రపంచాన్ని కలవర పెడుతోంది. ఇప్పటికే చైనాను వణికిస్తోంది. మూడేళ్ల నుంచి చైనా ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తున్న జీరో కొవిడ్ విధానంపై నిరసనలు వెల్లువెత్తడంతో డ్రాగన్ ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేసింది. దీంతో కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చైనాలో ఆస్పత్రులన్నీ కొవిడ్ రోగులతో నిండిపోయాయి. మృతులతో శవాగారాలు, శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయి.
ప్రమాద ఘంటికలు
చైనాలో కరోనాపై అమెరికా కీలక ప్రకటన చేసింది. డ్రాగన్ దేశంలో హైడ్రోజన్ బాంబులా కొవిడ్ విస్ఫోటం సంభవిస్తోందని అమెరికన్ అంటువ్యాధి నిపుణుడు ఎరిక్ ఫైగెల్ డింగ్ హెచ్చరించారు. వచ్చే 3 నెలల్లో ఆదేశంలో 60 శాతం మంది కరోనా బారిన పడతారని అంచనా వేశారు. 10 శాతం ప్రపంచ జనాభా కొవిడ్ బారిన పడుతుందని వివరించారు. మరణాల సంఖ్య లక్షల్లో ఉంటుందని హెచ్చరించారు. గతంలో చైనాలో కొవిడ్ కేసులు రెట్టింపు కావడానికి కొన్ని రోజులు పట్టేదని కానీ ఇప్పుడు
గంటల వ్యవధిలో రెట్టింపు అవుతున్నాయని తెలిపారు.
అత్యాధునిక వైద్య సదుపాయాలున్న చైనా రాజధాని బీజింగ్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నగర తూర్పు శివారులోని బీజింగ్ డాంగ్ జియావో దహనవాటికలో ఇంతకు ముందు రోజూ దాదాపు 40 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగేవి. ఇప్పుడు 200 అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఈ శ్మశానంలో 24 గంటలూ అంత్యక్రియలు జరుగుతున్నాయి. శ్మశాన వాటిక సిబ్బంది కూడా వైరస్ బారిన పడుతున్నారు. ప్రస్తుతం బీజింగ్ జనాభాలో 70% మందికి పైగా కొవిడ్ సోకిందని అంచనా వేస్తున్నారు.
చైనాలో కరోనా విజృంభిస్తున్న వేళ భారత్ అప్రమత్తం అయ్యింది. కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కొత్త వేరియంట్లపై జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా టెస్టుల సంఖ్య పెంచుతున్నాయి. శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులకు పంపుతున్నాయి.