Kaleshwaram Project: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మళ్లీ దర్యాప్తును కొనసాగించనున్నది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణంలో పనిచేసిన ఇంజినీర్లను రేపటి నుంచి రానున్న శనివారం వరకు ఒక్కొక్కరుగా విచారణకు హాజరుకావాలంటూ తాజాగా ఆదేశాలను జారీ చేసింది. ఇందులో భాగంగా ఈఎన్సీలను, ఉన్నతాధికారులను కమిషన్ ప్రశ్నించనున్నది. వారిని విచారించనున్న నేపథ్యంలో ఇటు నీటి పారుదల శాఖను కూడా కమిషన్ ఆదేశించింది. ఇందుకు సంబంధించిన అన్ని నివేదికలను ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నది.
Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్.. అడ్డుపడితే ఊరుకునేది లేదంటూ కేటీఆర్ ఫైర్
ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన ప్లేస్ మెంట్ రిజిస్టర్, ఎంబుక్ లను కూడా తీసుకురావాలంటూ ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ విషయంలో కమిషన్ పలు కీలక విషయాలను వెల్లడించింది. ఈ విచారణ సందర్భంగా కమిషన్ ను తప్పుదోవ పట్టించినా, నేరపూరితంగా వ్యవహరించినా, వారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని, అదేవిధంగా వారికి భవిష్యత్తులో పదోన్నతులు ఇవ్వొద్దంటూ ప్రభుత్వానికి సిఫారాసు చేసే విషయమై ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నది. ఇటు విజిలెన్స్ విభాగానికి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. తుది నివేదిక ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నది. మరో విషయమేమంటే.. కాళేశ్వరం నివేదిక ఆధారంగా కాగ్ అధికారుల నుంచి కూడా తాము వివరాలను కోరనున్నట్లు పీసీ ఘోష్ కమిషన్ పేర్కొన్నది.
Also Read: హరీశ్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ‘నువ్వు ట్రై చేయవా?’