Congress: తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ల చిచ్చు కలకలం రేపుతోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై జీ9 గ్రూప్ తిరుగుబాటు బావుటా ఎగరవేసింది. కమిటీలు, పదవులు అంటూ ఏవేవో కారణాలు చెబుతున్నా.. రేవంత్ తో సీనియర్లకు ‘ఇగో’ ప్రాబ్లమ్ అనేది ఓపెన్ సీక్రెట్. అధిష్టానం ట్రబుల్ షూటర్ గా దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపినా.. ఆయన చేసేది పెద్దగా ఏమీ ఉండకపోవచ్చని అంటున్నారు. ఇంతలోనే మరో బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో రాజకీయ వేడి మరింత రాజుకుంది.
కాంగ్రెస్ అసంతృప్త సీనియర్లు బీజేపీతో టచ్ లోకి వచ్చారని.. పార్టీలో ప్రాధాన్యం దక్కకపోతే కాషాయ కండువా కప్పుకునేలా చర్చలు జరుగుతున్నాయంటూ ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో లీకులు వస్తుండటం కాంట్రవర్సీగా మారుతోంది. మెయిన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి టార్గెట్ గానే ఆ ప్రచారం జరుగుతుండటం వెనుక ఏదో కుట్ర ఉందని అంటున్నారు.
సీనియర్లకు టీమ్ లీడర్ గా భట్టి కనిపిస్తున్నా.. వివాదం మాత్రం ఉత్తమ్ చుట్టూనే తిరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ కు కోవర్ట్ గా మారారంటూ తీన్మార్ మల్లన్న పోస్టు పెట్టడం.. ఆ పోస్టు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారనే అనుమానంతో.. అగ్గి రాజుకుంది. గతంలోనూ సోషల్ మీడియా బాధితులుగా మారిన సీనియర్లంతా ఒక్కఇంట్లో చేరి మంతనాలు చేశారు. రేవంత్ రెడ్డిపై రెబెల్ వాయిస్ వినిపించారు.
అయితే, కొందరు సీనియర్లు టీఆర్ఎస్ కు కోవర్టులంటూ ఇన్నాళ్లూ ప్రచారం జరగ్గా.. తాజాగా అదే సీనియర్లు బీజేపీలోకి వెళ్లబోతున్నారంటూ కొత్త రాగం అందుకోవడం ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ కు కోవర్టులైతే.. బీఆర్ఎస్ లో చేరాలి గానీ.. బీజేపీలో ఎందుకు చేరుతారనేది ప్రశ్న. దీన్నిబట్టి చూస్తే.. సీనియర్లను కావాలనే బద్నామ్ చేసేలా.. తెరవెనుక ఎవరో గట్టి ప్రయత్నమే చేస్తున్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
జీ9 గ్రూపులో ఉన్నదంతా కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులే. వాళ్లలో ఎవరూ అంత ఈజీగా పార్టీని వీడే టైప్ కాదని అంటున్నారు. ఇప్పుడు కూడా వారి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారే కానీ, ఎవరినీ రాజీనామా చేయాలని కానీ, పార్టీని వీడుతామని కానీ, ఎక్కడా లైన్ దాటి ప్రకటనలు చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల ఇమేజ్ ఇంతగా డ్యామేజ్ చేయాలని చూస్తున్నది ఇంటిదొంగలేనా? లేదంటే, ప్రత్యర్థి పార్టీలా?