Prakash Raj vs VHP: తిరుమల లడ్డూ వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇది చిన్న విషయం.. అంత పెద్ద చేసి మాట్లాడి, ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయకండి అని ఆయన చేసిన వ్యాఖ్యల్ని విశ్వహిందూ పరిషత్ తప్పుపట్టింది. హిందూత్వాన్ని నమ్మనివారు, హిందూ విశ్వాసాలపై నమ్మకం లేనివారి ఇలాంటి విషయాలపై మాట్లాడకపోవడం మంచిదని వీహెచ్ పీ తెలంగాణ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి విషయాల్లో అనవసరంగా తలదూర్చి.. మీ పరువు తీసుకోకండి అంటూ హెచ్చరించారు.
తిరుమల లడ్డూలో జంతుకొవ్వులు కలిపిన కల్తీ నెయ్యిని వాడటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుండగా.. ప్రకాష్ రాజ్ వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదని ఫైరయ్యారు. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం అస్సలు కాదని, జోక్యం చేసుకోకపోవడం మంచిదని ప్రకటనలో తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా సనాతన బోర్డును ఏర్పాటు చేసి.. దాని ద్వారానే హిందూ ఆలయాల నిర్వహణ ఉండాలన్న డిప్యూటీ సీఎం పవన్ అభిప్రాయానికి తమ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: మరోసారి బయటపడ్డ టీటీడీ అధికారుల నిర్లక్ష్యం.. ఈసారి కల్తీ కాదు.. ఏకంగా పొగాకే..
ఇదిలా ఉండగా.. నేడు తిరుమల ఆలయంలో పండితులు శాంతి హోమం నిర్వహించారు. లడ్డూ తయారీ, అమ్మకాలు జరిపే ప్రదేశాల్లో సంప్రోక్షణ చేశారు. జంతువుల కొవ్వు వాడటంతో అపవిత్రమైన ఆలయాన్ని శుద్ధి చేసినట్లు టీటీడీ ప్రకటించింది. ఇకపై లడ్డూ ప్రసాదం విషయంలో ఎలాంటి భయం అక్కర్లేదని, అంతా శుద్ధిగానే జరుగుతుందని వెల్లడించింది.