BJP: కేటీఆర్ ఆవేశపడ్డారో, కావాలనే అన్నారో తెలీదు కానీ, ఆయన చేసిన డ్రగ్స్ ఛాలెంజ్ రాజకీయ ప్రకంపణలు రేపుతోంది. కావాలంటే తన రక్తం, చర్మం, గోర్లు, వెంట్రుకలు, కిడ్నీ కూడా ఇస్తానని.. డాక్టర్లతో టెస్టులు చేయించుకోమని.. క్లీన్ చిట్ వస్తే కరీంనగర్ సెంటర్ లో బండి సంజయ్ తనను తాను చెప్పుతో కొట్టుకుంటాడా? అంటూ కేటీఆర్ చేసిన సవాల్ ఇప్పుడు కాక రేపుతోంది. కేటీఆర్ సవాల్ పై కమలనాథులు కస్సుమంటున్నారు.
కేటీఆర్ కు షుగర్ వ్యాధి ఉందని.. ఆయన కిడ్నీ, గోర్లు ఎవరికి కావాలంటూ సెటైర్లు వేశారు బీజేపీ ఎంపీ అర్వింద్. గతంలో రేవంత్ రెడ్డి డ్రగ్స్ ఛాలెంజ్ చేసినప్పుడు ఇస్తానన్న వెంట్రుకలు ఇప్పటి వరకూ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ సవాల్ పై బీజేపీ ఎంపీ నిలదీయడం ఆసక్తికరంగా మారింది.
బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ సైతం కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. దొంగలుపడిన 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు.. బండి సంజయ్ సవాల్ చేసిన రెండేళ్ల తర్వాత ఇప్పుడు స్పందించడం ఏంటని ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలు కేటీఆర్ శాంపిల్స్ తీసుకునే సమయం తొందరలోనే వస్తుందని హెచ్చరించారు. కేటీఆర్ మాటలు ఆయన ఫ్రస్టేషన్ ను సూచిస్తున్నాయని అన్నారు.
శరీరంలో డ్రగ్స్ ఆనవాళ్లు 24 గంటల నుంచి 9 నెలల వరకు మాత్రమే ఉంటాయని.. కేటీఆర్ విదేశాలకు వెళ్లి డి-అడిక్షన్ ట్రీట్మెంట్ చేయించుకొని.. బాడీలో డ్రగ్స్ ఆనవాళ్లు ఏమీ లేవని నిర్థారించుకున్నాకే.. ఇప్పుడు దొంగ సవాల్ విసురుతున్నారని అన్నారు. నిజంగా డ్రగ్స్ తీసుకోకపోతే.. బండి సంజయ్ సవాల్ కు అప్పుడే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు డీకే అరుణ.