ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే ఏ పాల్, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ.. వారి పార్టీల కంటే ఇండివిడ్యువల్గానే ఆ ఇద్దరు ఫేమస్.. 2024 ముందు వరకు కూడా విశాఖ రాజకీయాల్లో తమకంటూ ఒక ముద్ర వేసుకోవడానికి ప్రయత్నం చేశారు ఆ ఇద్దరు. పేరుకి పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనా రాజకీయం మొత్తాన్ని విశాఖ నుండే నడిపారు. పార్టీ అధ్యక్షులుగా ఒకరేమో అసెంబ్లీకి మరొకరు పార్లమెంటుకి పోటీ చేసి ఘోర ఓటమి చెందారు. అప్పటివరకు మేం విశాఖలోనే ఉంటాం విశాఖ అభివృద్ధి బాధ్యత తీసుకుంటాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని ప్రకటనలు చేసిన ఆ ఇద్దరూ విశాఖలో కనిపించడం మానేశారు.
ప్రపంచ శాంతి దూతనని చెప్పుకునే కేఏ పాల్విశాఖ నుంచి తన రాజకీయాన్ని ప్రారంభించి పెద్ద పొలిటీషన్గా ఎదుగుదామనుకున్నారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా, సీబీఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వచ్చి విశాఖ నుంచే తన పయనం మొదలుపెట్టారు. 2008లో ప్రజాశాంతి పార్టీని స్థాపించిన డాక్టర్ కే ఏ పాల్ 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి వినూత్న ప్రచారాలతో కామెడీ పీస్గా మారిపోయారు. పోలింగ్ రోజు తన ఓటు తానే వేసుకున్నానని చిందులేసి సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు. 2024 ఎన్నికల్లో పాల్ విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 7,524 ఓట్లు సాధించి ఘోరపరాజయం పాలయ్యారు.
ఇక సీబీఐ జేడీగా జగన్ అక్రమాస్తుల కేసులను దర్యాప్తు చేసిన లక్ష్మీనారాయణ దేశంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి విశాఖ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఆయన దాదాపు 3 లక్షల ఓట్లు సాధించడం విశేషం. తర్వాత జనసేన పార్టీకి రాజీనామా చేసి జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించి ఆ పార్టీ అధ్యక్షుడు హోదాలో విశాఖ నార్త్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. సిబిఐ జెడిగా, ఐపీఎస్ అధికారిగా ఎన్నో చాలెంజింగ్ కేసులను సమర్థవంతంగా ఎదుర్కొన్న లక్ష్మీనారాయణ రాజకీయాల్లో మాత్రం సక్సెస్ కొట్టలేకపోయారు.
2024 ఎన్నికలకు ముందు విశాఖలోనే ఉంటూ విశాఖలోనే తింటూ.. రాజకీయంగా తమ పార్టీలను బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేసిన డాక్టర్ కే ఏ పాల్,లక్ష్మీనారాయణలు ప్రస్తుతం ఎక్కడా కనిపించడం లేదు. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. దానిపై లక్ష్మీనారాయణ అప్పట్లో ప్రజల నుంచి విరాళాలు సేకరించిన స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేస్తానని ప్రకటించి సంచలనం రేపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కోర్టులో కేసులు వేశారు. ఐదు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా తానే అడ్డుకుంటున్నానని ప్రకటనలు కూడా చేశారు.
Also Read: ద్వారంపూడి చిక్కినట్టేనా? కాకినాడలో షాపుల కూల్చివేత
స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప్రైవేటీకరణ అంశాన్ని 2024 ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మార్చుకుని ప్రచారం చేసుకున్నారు. జెడి లక్ష్మీనారాయణ రాజకీయంగా స్టీల్ ప్లాంట్ విషయంలో ఆ విధంగా ముందుకు వెళితే.. కేఏ పాల్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగే శక్తి తనకొక్కడికే ఉందని భారీ స్టేట్మెంట్లు ఇచ్చారు. కోర్టులో కేసులు వేసి సొంతంగా వాదనలు కూడా వినిపించారు. అందరి దృష్టి ఆకర్షించేలాగా కోర్టులో నేటికీ కేసులు నడుపుతున్నారు. ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కేవలం తమ రాజకీయ భవిష్యత్తు కోసమే స్టీల్ ప్లాంట్ ని కాపాడుతామని ప్రకటనలు చేస్తున్నారని. తాను మాత్రమే స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు న్యాయపోరాటం చేస్తున్నానని ఎన్నికల ప్రచారంలో చెప్పుకున్నారు.
ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దుమారం రోజురోజుకీ పెద్దది అవుతుంది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం సైలెంట్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పావులు కదుపుతున్నట్లు కనిపిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న ఉన్నత స్థాయి ఉద్యోగులను ఇతర స్టీల్ ప్లాంట్లకు ట్రాన్స్ఫర్ చేసే ఆలోచనలో కనిపిస్తుంది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ కు 3 వేలకోట్లను మంజూరు చేసి … అందర్నీ అయోమయంలోకి నెట్టేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా తమకు ఎంతగానో ఉపయోగపడిన విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో 2024 ఎన్నికలకు ముందు ఎన్నో ప్రకటనలతో హడావుడి చేసి, కోర్టులో కేసులు వేసిన లక్ష్మీనారాయణ కానీ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గాని ప్రస్తుతం నోరు మెదపడం లేదు.
బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో కూడా టీడీపీ, జనసేనలు కీలకంగా ఉన్నాయి. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తీవ్ర రూపం దాలుస్తున్న తరుణంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. గతం నుండి స్టీల్ ప్లాంట్ విషయాల్లో పల్లా శ్రీనివాసరావు ఒకే మాటగా ఉండి తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతున్నారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాసరావు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా.. తన పదవులకు రాజీనామా చేస్తానని ప్రకటించి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు, విశాఖ వాసుల్లో తనపై పాజిటివ్ వచ్చేలా చేసుకున్నారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కోర్టుల్లో కేసులు వేసిన లక్ష్మీనారాయణ కానీ, కేఏ పాల్ గాని ప్రస్తుతం విశాఖలో ఎక్కడ కనిపించడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తెరమీదకు రావడంతో ఎన్నికల ముందు స్టీల్ ప్లాంటే ప్రధాన అజెండాగా హడావిడి చేసిన కే ఏ పాల్, లక్ష్మీనారాయణ కనిపించకుండా పోవడంపై విశాఖవాసులు చర్చించుకుంటున్నారు. మరి కేవలం రాజకీయాల కోసమే విశాఖపట్నంపై తమ ప్రేమను చూపించిన వారిగా ఆ ఇద్దరు మిగిలిపోతారో? లేకపోతే స్టీల్ ప్లాంట్ ఇష్యూపై రియాక్ట్ అయి పోరాడతారో చూడాలి.