Sri Lankan prime minister resigns after Dissanayake’s presidential win: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో కుమార దిసనాయకే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ప్రధాని పీఠం నుంచి దినేశ్ గుణవర్దెన వైదొలిగారు. కాగా, శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్థిక సంక్షోభం, అవినీతితో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కొత్త నాయకత్వం వెలుగులోకి రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ జనతా విముక్తి పెరమున పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత కుమార దిసనాయకే విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తొలుత విజయానికి అవసరమైన 50 శాతానికి పైగా ఓట్లు ఏ అభ్యర్థికీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. ఇదిలా ఉండగా, మొదటి ప్రాధాన్య ఓట్ల సమయంలోనే విజేత ఎవరో ఖరారయ్యేవారు. కానీ ఈసారి ఆర్థిక సంక్షోభం, అవినీతి అంశాల వలన త్రిముఖ పోరు ఏర్పడింది. దీంతో ప్రజలు కూడా ఏక పక్షంగా ఓట్లు వేయలేదు. ఆచీ తూచీ ఆలోచించారు. రాజపక్స కుటుంబ అవినీతి పాలనకు విసిగిపోయిన ప్రజలు.. మార్క్సిస్టు విధానాల వైపు మొగ్గు చూపారు.
అనంతరం రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించగా.. మార్క్సిస్ట్ నేత కుమార దిసనాయకే విజయం సొంతం చేసుకున్నారు. ప్రత్యర్థి నాయకుడు సాజిత్ ప్రేమదాస 32.76 శాతం గెలుచుకొని రెండో స్థానంలో నిలిచారు. అయితే రెండోసారి అధికారాన్ని చేపట్టాలని ఆశిస్తోన్న ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే.. తొలి రౌండ్లోనే అవుట్ అయ్యారు. ఆయనకు కేవలం 17 శాతం ఓట్లు మాత్రమే రావడంతో మూడో స్థానంలో నిలిచారు. అయితే దేశ వ్యాప్తంగా మొత్తం 1.7 కోట్ల మంది ఓటర్లలో 75 శాతానికి పైగా ప్రజలు ఓటు వేశారు.
మొత్తం పోలైన ఓట్లలో అనుర కుమారకు 42.31 శాతం ఓట్లు సాధించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కాగా, శ్రీలంక నూతన అధ్యక్షుడిగా అనుర కుమార దిసనాయకే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ వెల్లడించింది. అయితే శ్రీలంక చరిత్రలో రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కించడం ఇదే తొలిసారి కావడం విశేషం. అవినీతిపై పోరాటం అంటూ ప్రచారాన్ని ఎక్కు పెట్టిన దిసనాయకేకు శ్రీలంక ప్రజలు మద్దతు తెలిపారు.
1968 నవంబర్ 24న తంబుట్టెగామలో కార్మిక కుటుంబంలో దిసనాయకే జన్మించారు. అనంతరం ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నారు. దిసనాయకే.. తన గ్రామం నుంచి యూనివర్సిటీ సీటు పొందిన తొలి వ్యక్తిగా రికార్డుకెక్కారు. విద్యార్థి నేతగా మొదలై దేశాధినేతగా ఎదిగిన దిసనాయకే ప్రస్థానం చాలా మందికి స్పూర్తి అని చెప్పాలి. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో గ్రాడ్యుయేట్ చేసి ఆ తర్వాత సోషలిస్టు స్టూడెంట్స్ అసోసియేషన్లో చేరారు. 1987లో జేవీపీలో చేరిన దిసనాయకే..1998 నాటికి పొలిట్బ్యూరోలో చోటు దక్కింది. ఇక, 2000లో ఎంపీ అయిన దిసనాయకే.. 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా కూడా సేవలందించారు.
Also Read: ప్రవాస భారతీయులే బ్రాండ్ అంబాసిడర్లు.. అమెరికా పర్యటనలో మోదీ
గత ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. ఈ సారి అనూహ్యంగా అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. 2022లో శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రావడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఆయన ఆయుధంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లారు. మార్పు, అవినీతి, వ్యతిరేక సమాజం వంటి నినాదాలతో ఆయన ప్రజల్లో విస్తృత ప్రచారం చేశారు. అవినీతి, వైఫల్యాలను ఎండగడుతూనే జవాబుదారీతనం వివరించి సక్సెస్ అయ్యారు. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు.