Tragedy in Maredumilli Tour: మారేడుమిల్లి విహారయాత్రకు వెళ్లి.. ఇద్దరు మెడికోలు మృతి చెందారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఈ ఘటన విషాదాన్ని నింపింది. ఏలూరులోని ఆశ్రం కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతున్న 14 మంది మెడికల్ స్టూడెంట్స్ ఒక ట్రావెలర్ వెహికల్ లో ఆదివారం మారేడుమిల్లి విహారయాత్రకు వెళ్లారు. మారేడుమిల్లి ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రాంతం. వేసవి విడిదికి, శీతాకాలపు అందాలకు పెట్టింది పేరు మారేడుమిల్లి.
ప్రకృతి అందాలను స్నేహితులతో కలిసి చూసేందుకు వెళ్లినవారు.. మారేడుమిల్లి నుంచి చింతూరుకు వెళ్లే అంతర్రాష్ట్ర దారిలో జలతరంగిణి వాటర్ ఫాల్స్ కు చేరుకున్నారు. అప్పుడే భారీ వర్షం కురవడంతో.. జలపాతం ఉద్ధృతి పెరిగింది. వెళ్లిన స్టూడెంట్స్ లో ఐదుగురు సౌమ్య, హరదీప్, హరిణిప్రియ, అమృత, గాయత్రి పుష్ప గల్లంతయ్యారు. వారిలో హరిణిప్రియ, గాయత్రి పుష్పను ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన యువకులు కాపాడారు. విజయనగరానికి చెందిన ఇద్దరినీ రంపచోడవరం ఆస్పత్రికి తరలించగా.. హరిణిప్రియ పరిస్థితి విషమంగా ఉందని రాజమండ్రికి తరలించారు.
Also Read: తిరుమలలో శాంతి హోమం.. పంచగవ్య ప్రోక్షణ
గల్లంతైన వారిలో మరో ముగ్గురి ఆచూకీ కోసం పోలీసులు గాలించగా.. సోమవారం ఉదయం ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని సౌమ్య(21), అమృత(21)లుగా గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. డాక్టర్లు అయ్యి ఉన్నతస్థానాలకు వెళ్తారనుకున్న పిల్లలు.. ఇలా మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. హరదీప్ ఆచూకీ కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.