Tirupati Laddu Controversy: తిరుపతి లడ్డూ ప్రసాదంపై జంతువుల కొవ్వు కలిపినట్టుగా వచ్చిన నివేదిక సంచలనాన్ని రేపింది. ఇది తిరుమల, తిరుపతి పుణ్యక్షేత్రానికి, సాక్షాత్తు వేంకటేశ్వరస్వామికే అపచారం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంత అపవిత్ర జరిగినందున.. దోష నివారణ కోసం యాగం, హోమాలు చేయాలని ఆగశాస్త్ర పండితులు నిర్ణయం తీసుకున్నారని వివరించారు.
తిరుమలలో స్వామివారి బంగారు బావి సమీపంలోని విమాన ప్రాకారం దగ్గర ఉన్న యాగశాలలో శాంతి యాగం నిర్వహిస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రేపు ఉదయం 6 గంటలకు ఈ శాంతి యాగం మొదలవుతుందని తెలిపారు. ఆ తర్వాత అర్చకులు పంచగవ్య ప్రోక్షణ నిర్వహిస్తారని చెప్పారు. ఇందుకోసం మూడు హోమగుండాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ యాగంలో 8 మంది అర్చకులు, ముగ్గురు ఆగమ సలహాదారులు ఉంటారని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో అధికార దుర్వినియోగం జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇష్టారీతిన దర్శనం టికెట్లు అమ్ముకున్నారని పేర్కొన్నారు. 3.77 లక్షల టికెట్లు ఇష్టారీతిన అమ్మేసుకున్నారని చెప్పారు. లడ్డూ అపవిత్రతపై సిట్ వేసి విచారనిస్తామని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. ఐజీ, ఆపైస్థాయి అధికారితో సిట్ వేస్తామని తెలిపారు. ఆ సిట్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా తాము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే ఈ వ్యవహారాలపై ప్రత్యేక కమిటీ కూడా వేస్తామని వివరించారు. ఈ కమిటీలో ఆగమశాస్త్రం తెలిసిన వారు సభ్యులుగా ఉంటారని తెలిపారు. సిట్ ఇచ్చే నివేదిక ఆధారంగా తాము సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.
Also Read: Chandrababu: జగన్ గట్స్ చూశారా?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
తిరుమలలో అపవిత్రత కారణంగా భక్తులు ఇక్కడికి రాని పరిస్థితి.. ఇంట్లోనే ఉండి వెంకటేశ్వరస్వామికి పూజలు చేసుకునే దుస్థితి నెలకొందని చంద్రబాబు నాయుడు తెలిపారు. అందుకే దోష నివారణ కోసం అర్చకులు నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. తాను వ్యక్తిగతంగా వెంకటేశ్వరస్వామికి భక్తుడు అని చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఏ కార్యం మొదలుపెట్టినా స్వామివారిని తలుచుకుంటానని చెప్పారు. అధికారంలో లేనప్పుడు కూడా తాను టీటీడీ వెళ్లితే క్యూ లైన్లోనే దేవుడిని దర్శించుకున్నాని వివరించారు. తాను అప్పుడు మాజీ ముఖ్యమంత్రి.. అది చాలు తాను నేరుగా స్వామి వారి దర్శనం పొందడానికి, కానీ, తాను అలా వెళ్లలేదని పేర్కొన్నారు. ఎందుకంటే అది తన భక్తి అని వివరించారు.
మనమంతా ఉన్నా.. తిరుమలలో జరిగిన అపవిత్రతను అడ్డుకోలేకపోయామని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అపవిత్రం చేసిన వారిని ఆ భగవంతుడే చూసుకుంటాడని వివరించారు. అంతటి అపచారం చేసిన వ్యక్తులు క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. ఇలా ఎదురుదాడి చేస్తే దానికి దేవుడే సాక్షి అని పేర్కొన్నారు.