Harishrao Reaction on Minister Ponnam Remarks : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పొన్నం చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా వివక్షకు గురైందన్నారు. వివక్షలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు పెండింగ్ ప్రాజెక్టుగా మిగిలిపోయిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చామన్నారు. ఎఫ్ఆర్ఎల్ 148 మీటర్ల వరకు భూసేకరణ జరగలేదు.. కరీంనగర్ – మంచిర్యాల రాజీవ్ రహదారిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మించలేదు.. 144 మీటర్లకు చేరితే పాత లోలెవెల్ బ్రిడ్జి మునిగిపోయి రాకపోకలు స్తంభించిపోతాయని ఆయన అన్నారు.
Also Read: రాజకీయ సన్యాసం స్వీకరిస్తా.. పొంగులేటి సవాల్ స్వీకరించిన కేటీఆర్
కాంగ్రెస్ హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టును అసలే పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక వాటన్నిటినీ పూర్తి చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఎఫ్ఆర్ఎల్ 148 మీటర్ల వరకు 20 టీఎంసీల నీరును నిల్వ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదంతా జరిగింది కేవలం తెలంగాణ ఏర్పడిన తరువాతననే విషయం కరీంనగర్ ప్రజలు, రైతులకు బాగా తెలుసన్నారు. కానీ, ఈ విషయాన్ని మంత్రి గుర్తించడంలేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వివరాలు వెల్లడించారన్నారు. గత నాలుగేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సుమారు 20,33,572 ఎకరాలకు సాగునీరందిందనీ ఉత్తమ్ కుమార్ రెడ్డే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. ఒకవేళ అది గనుక అబద్ధమైతే.. అబద్ధాలు చెప్పి అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు ఆయనపై ప్రివిలేజ్ మోషన్ పెట్టవల్సి వస్తుందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ విషయంపై మంత్రి పొన్నం క్లారిటీ ఇవ్వవల్సి ఉందన్నారు.
Also Read: ఇపుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి