Work Pressure: తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ టెకీ ఆత్మహత్య చేసుకున్నాడు. లోదుస్తులు ధరించి కరెంట్ తీగను బాడీ చుట్టూ చుట్టేసుకున్నాడు. ఆ తీగకు మెయిన్ జంక్షన్ బాక్స్కు కనెక్షన్ ఇచ్చాడు. స్విచ్ఛాన్ చేసుకుని ప్రాణాలు వదిలినట్టు తెలుస్తున్నది. ఆత్మహత్యకు ముందు ఆయన ఓ సూసైడ్ లెటర్ కూడా రాశాడు. తన కుటుంబ సభ్యులు అందరికీ ఓ సందేశాన్ని అందులో పొందుపరిచినట్టు పోలీసులు వివరించారు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడులోని తెని జిల్లాకు చెందిన 38 ఏళ్ల కార్తికేయన్ టెక్ ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఆయన కే జయరాణిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఎనిమిది, పదేళ్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగరీత్యా ఆయన చెన్నైలోని తాళంబూర్లో ఉంటున్నాడు. పల్లవరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. టెక్ పరిశ్రమలో ఒత్తిడి సహజం. కొన్ని కంపెనీలు ఉద్యోగులపై విపరీతమైన ఒత్తిడి తీసుకువస్తాయి. ఎంతలా అంటే.. ఆ ఒత్తిడితో వారి ఆరోగ్యాలే దెబ్బతినిపోతాయి. కొందరు సిగరెట్, మద్యానికి బానిస కూడా అవుతారు. కొందరేమో డిప్రెషన్లోకి వెళ్లిపోతారు.
కార్తికేయన్ కూడా ఆఫీసులో వర్క్ ప్రెజర్ తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్లాడు. మేడవక్కంలోని ఓ హాస్పిటల్లో కార్తికేయన్ డిప్రెషన్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కానీ, ఏమైందో ఏమో.. జీవితంపై ఆయనకు ఎలాంటి ఆశావాద ఆలోచన లేకుండా పోయిందో.. అసలు జీవితమే వ్యర్థం అనుకున్నాడో ఏమో గానీ.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కరెంట్ తీగను బాడీ చుట్టు అల్లుకుని కరెంట్ షాక్ ఇచ్చుకుని మరణించాడు. వర్క్ ప్రెజర్ వల్లే కార్తికేయన్ మరణించినట్టు స్థానికులు చెబుతున్నారు.
Also Read: Manish Sisodia: నా కొడుకు చదువు కోసం డబ్బుల్లేక చాలామందికి ఫోన్ చేశా: మనీశ్ సిసోడియా
జయరాణి సోమవారం తిరునళ్ళారూ ఆలయానికి ఫ్రెండ్స్తో కలిసి వెళ్లింది. పిల్లలను ఆమె తల్లి వద్ద వదిలిపెట్టింది. గుడి నుంచి ఆమె తిరిగి ఇంటికి వచ్చేసింది. ఇంటి తలుపు తడితే ఎలాంటి స్పందన రాలేదు. కాసేపు డోర్ నాక్ చేసినా ఫలితం లేదని నిర్ధారించుకుంది. తన వెంటే ఉంచుకున్న స్పేర్ కీతో డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా కనిపించిన దృశ్యంతో జయరాణి షాక్ అయింది.
తన భర్త లోదుస్తుల్లో ఉన్నాడు. కరెంట్ తీగలను దేహం చుట్టూ చుట్టుకుని ఉన్నాడు. వాటిని తన చేతుల్లో పట్టుకుని ఉన్నాడు. కరెంట్ పాస్ అవుతూ ఉన్నది. కార్తికేయన్ మరణించి విగతజీవిగా ఉన్నాడు. ఆ దృశ్యం చూడగానే జయరాణి కేక వేసింది. వెంటనే ఇరుగుపొరుగును పిలిచింది. వారు వచ్చి జరిగిన ఘటన చూసి పోలీసులకు సమాచారం అందించారు.
కార్తికేయన్ ఇటీవలే జాబ్ మారాడని, ఓ సూసైడ్ నోట్ కూడా రాశాడని, తన కుటుంబ సభ్యులకు ఓ సందేశాన్ని ఇచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని, అసహజ మరణం కింద కేసును నమోదు చేశామని వివరించారు. ఈ కేసు దర్యాప్తు అసలు కార్తికేయన్ మరణానికి దారితీసిన ఇతర అంశాలు అన్నీ క్లియర్గా బయటపడనున్నాయి.