– దమ్ముంటే.. అమృత్ టెండర్లు బయటపెట్టండి
– సీఎం బంధుప్రీతితో పదవి పోవటం ఖాయం
– కాంగ్రెస్లోని మిత్రుల ద్వారానే సమాచారం
– అవినీతిపై న్యాయవిచారణకు సిద్ధమా?
– బీజేపీ నేతల మౌనం వెనక కారణమేంటి?
– బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
BRS Party: కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ అభిమానులు ఉన్నారని, అక్కడ జరిగే అక్రమాలు తమకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయని, ప్రతి తప్పిదాన్ని జనం ముందు పెట్టేందుకు తాము రెడీగా ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్లకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, అమృత్ టెండర్ల విషయంలో తనపై పరువు నష్టం దావా వేస్తానని మంత్రి పొంగులేటి సవాలును స్వీకరిస్తు్న్నట్లు ప్రకటించారు.
బావమరిది కోసమే..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సూదిని సృజన్రెడ్డి కంపెనీ శోధ కన్స్ట్రక్షన్స్కు అర్హతలు లేకున్నా వేలకోట్ల రూపాయల పనులు కట్టబెట్టారని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ టెండర్లలో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక వనరులు కానీ, ఆర్థిక పరపతి కానీ, సంపత్తి కానీ ఆ కంపెనీకి లేవని పేర్కొన్నారు. ఈ కారణంగానే సీఎం స్వయంగా జోక్యం చేసుకొని, ఇండియన్ హ్యూమ్ పైప్ (ఐహెచ్పీ) అనే కంపెనీని పిలిపించి, ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారన్నారు. ఇవి కేంద్ర ప్రభుత్వం నిధులకు సంబంధించిన విషయమని, మరి ఈ వ్యవహారంపై కేంద్రమంత్రుల కిషన్ రెడ్డి, బండి సంజయ్ నుంచి మొదలుకొని ఒక్క ఎంపీ కూడా మాట్లాడటకపోవడం విస్మయంగా ఉన్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధుల్లో అవినీతి జరుగుతున్నా ఒక్క మాట కూడా బీజేపీ నేతలు మాట్లాడటం లేదని పేర్కొన్నారు.
విచారణకు సిద్ధమా?
బావమరిది కోసం రేవంత్ రాష్ర్టాన్ని దోచుకుంటున్నారని, దీనికోసమే అక్రమ టెండర్లకు తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. ఈ క్రమంలోనే అమృత్ టెండర్ల వివరాలను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, హైకోర్టు చీఫ్ జస్టిస్ వద్దకు లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లేదా మరేదైనా ఏజెన్సీ వద్దకు వెళ్లేందుకు రెడీ కావాలన్నారు. గత టెండర్లు, ప్రస్తుత టెండర్లను పరిశీలిస్తే తన ఆరోపణల్లో నిజముందో లేదో తెలుస్తుందని అన్నారు. ‘అమృత్ టెండర్లలో అవినీతి జరగలేదని రుజువు చేస్తే, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను’ అంటూ తాజాగా పొంగులేటి చేసిన సవాలును స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఆఫీస్ ఫర్ ప్రాఫిట్ చట్టం, అవినీతి నిరోధక చట్టం 1988 లో సెక్షన్ 7, 11, 13 నిబంధనల ప్రకారం అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప, ఆదర్శ్ కుంభకోణంలో 2011లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పదవి కోల్పోయారని, తెలంగాణ సీఎంకూ ఆ పరిస్థితి రానుందని జోస్యం చెప్పారు.
Also Read: Tirupati Laddu: ఇపుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి
మరిన్ని కుంభకోణాలు
రేవంత్రెడ్డి కుంభకోణాలను ఒక్కొక్కటిగా ప్రజల ముందు ఉంచుతానని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే కొడంగల్ ఎత్తిపోతల పథకం, ఫోర్త్ సిటీ కుంభకోణాలను బట్టబయలు చేస్తానన్నారు.
బోనస్ కాదు.. బోగస్
తాము అధికారంలో వచ్చే నాటికి 17 వేల రూపాయల లాభాల వాటా ఉంటే, అధికారంలో నుంచి దిగిపోయినప్పుడు 1. 70 లక్షల రూపాయల వరకు ప్రతి కార్మికుడికి లాభాల వాటా ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. ఇప్పుడు సింగరేణి కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన బోనస్కు, వచ్చిన లాభాలకు పొంతన లేదని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు లాభాల బోనస్ను బోగస్గా మార్చారని పేర్కొన్నారు. ‘ సింగరేణి నికర లాభం రూ.4701 కోట్లలో.. న్యాయంగా 33 శాతం వాటా 1,551 కోట్లు కావాలి.. ప్రతి కార్మికుడికి 3.70 లక్షల రూపాయలు రావాలి. కానీ కేవలం 796 కోట్ల రూపాయలు మాత్రమే కార్మికులకు పంచుతున్నారు. దీంతో ప్రతి సింగరేణి కార్మికుడు కనీసం లక్షా 80వేలు నష్టపోతున్నారు’ అని చెప్పుకొచ్చారు.