Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి తాజాగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఆయన ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. అక్కడికి వచ్చిన మెగా అభిమానులతో ఈవెంట్ కిక్కిరిసిపోయారు. అయితే ఇండస్ట్రీలో మెగాస్టార్ తో పాటు ఇంకా ఎంతో మంది హీరోలు ఉండగా, అసలు ఆయనకే ఎందుకు ఈ అరుదైన గౌరవం దక్కింది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
మెగాస్టార్ కే ఎందుకు ఈ గౌరవం?
నాలుగు దశాబ్దాలకు పైగా విశేషంగా తెలుగు మూవీ లవర్స్ ను అలరిస్తూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ మన మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఏకంగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.. అసలు ఆయనకు ఈ గౌరవం ఎందుకు ఇచ్చారు? అనే విషయంలోకి వెళ్తే… మెగాస్టార్ చిరంజీవి తన 45 ఏళ్ల కెరీర్ లో ఇప్పటిదాకా 156 సినిమాలు చేశారు. అందులో 537 పాటలు ఉండగా 24 వేల స్టెప్పులతో అలరించిన ఇండియాలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ యాక్టర్ గా ఆయనకు ఈ అరుదైన రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా కలిసి ఈ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి నేడు ప్రధానం చేశారు. ఈ వేడుకకు డైరెక్టర్ రాఘవేంద్ర రావు, బాబి, గుణశేఖర్, బి గోపాల్, కోదండరామిరెడ్డితో పాటు అల్లు అరవింద్, సురేష్ బాబు, జెమినీ కిరణ్, మైత్రి రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కెఎస్ రామారావు వంటి నిర్మాతలు కూడా పాల్గొన్నారు. 22 సెప్టెంబర్ అనేది 1978లో మెగాస్టార్ సినిమా పరిశ్రమలోకి అరంగేట్రం చేసిన రోజు కూడా కావడం విశేషం. పునాది రాళ్లు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన మెగాస్టార్ ఆరంభంలోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అంతేకాకుండా అడ్డుగా నిలిచిన అవమానాలను ఎదుర్కొని నేడు ఈ స్టేజ్ లో ఉండి కోట్లాది మందికి స్పూర్తిగా నిలిచారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తనదైన స్టైల్ లో డాన్స్, యాక్టింగ్ చేస్తూ యువతను ఉర్రూతలూగించిన ఘనత మెగాస్టార్ చిరంజీవికే దక్కింది. ఎన్నోసార్లు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన మెగాస్టార్ ఖాతాలో ఇప్పటిదాకా ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు వచ్చి చేరాయి.
మెగాస్టార్ అందుకున్న అవార్డులు
ఇప్పటిదాకా మెగాస్టార్ చిరంజీవి 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులతో పాటు ప్రతిష్టాత్మక పురస్కారాలు ఎన్నో అందుకున్నారు. 2006 లోనే సినీ రంగానికి చిరు చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మభూషణ్ ను ఇచ్చి సత్కరించింది. ఇక 2024లో పద్మ విభూషణ్ తో సత్కరించి కేంద్ర ప్రభుత్వం ఆయనను గౌరవించింది. కాగా ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న మెగాస్టార్ కు సెలబ్రిటీలతో పాటు అభిమానుల నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.