Sircilla: ఆదిభట్ల కిడ్నాప్ తరహాలో ఘటన. ఓ యువకుడు స్నేహితులతో కలిసి వచ్చి కారులో యువతిని ఎత్తుకెళ్లిపోయాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తండ్రిపై దాడి చేశాడు. యువతి కిడ్నాప్ ఎపిసోడ్ సీసీటీవీలో రికార్డు కావడంతో మీడియాలో హల్ చల్ చేసింది. ఉదయం నుంచి సిరిసిల్ల కిడ్నాప్ న్యూస్ సంచలనంగా మారింది.
కట్ చేస్తే.. మధ్యాహ్నానికి కిడ్నాప్ ఎపిసోడ్ మరో టర్న్ తీసుకుంది. తనను ఎవరూ ఎత్తుకెళ్లలేదని.. తానే అతనితో వెళ్లిపోయానంటూ.. జానీ అనే యువకుడిని పెళ్లి చేసుకున్న వీడియోను ఆ యువతి రిలీజ్ చేసింది. “నాలుగేళ్లుగా జానీని ప్రేమిస్తున్నా. నా కోరిక మేరకే జానీ నన్ను తీసుకెళ్లాడు. జానీని ఇష్టపూర్వకంగా ప్రేమ వివాహం చేసుకున్నా. మా తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తున్నారు. వచ్చి తీసుకెళ్లమని జానీకి నేనే ఫోన్ చేసి చెప్పా. తీసుకెళ్లేముందు మాస్క్ ఉండడంతో జానీని గుర్తుపట్టలేదు. గుర్తుపట్టిన తర్వాత ఇష్టపూర్వకంగా వెళ్లి వివాహం చేసుకున్నా” అని ఆ వీడియోలో చెప్పింది యువతి. తన కుటుంబ సభ్యులతో తనకు ప్రాణ హాని ఉందంటూ చివర్లో మరో ట్విస్ట్ కూడా ఇచ్చింది.
అసలేం జరిగిందంటే..
రాజన్న సిరిసిల్ల జిల్లా, చందుర్తి మండలం మూడపల్లిలో తెల్లవారుజామున 5 గంటల సమయంలో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. తండ్రి చంద్రయ్యతో కలిసి శాలిని అనే యువతి హనుమాన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా నలుగురు యువకులు కారులో వచ్చారు. ఆ యువతి పట్టుకునేందుకు ఓ యువకుడు ప్రయత్నించగా ఆమె పరుగెట్టేందుకు ప్రయత్నించింది. అయినా సరే ఆమెను పట్టుకుని బలవంతంగా కారులో ఎత్తుకెళ్లాడు. ఆమె తండ్రి అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆయనపై దాడి చేశారు. యువతిని కిడ్నాప్ చేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. శాలినికి సోమవారమే ఎంగేజ్మెంట్ అయింది. మరునాడే ఆమెను ఓ యువకుడు కిడ్నాప్ చేయడంతో తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. ఆ యువతి మైనర్ గా ఉన్నప్పుడు గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధించాడని.. అతనిపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు పేరెంట్స్. అప్పట్లో నిందితుడిపై పోక్సో కేసును పోలీసులు నమోదు చేశారు. ఆ కేసులో నిందితుడి జైలుకు వెళ్లొచ్చాడు. అతడే తమ అమ్మాయిని కిడ్నాప్ చేశాడని చంద్రయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలించాయి. కిడ్నాప్ చేసిన యువకుడిని జానేశ్వర్ అలియాస్ జానీగా గుర్తించారు.
వారి అనుమానం నిజమే అయింది. యువతిని కిడ్నాప్ చేసింది జానీనే. కాకపోతే, అది కిడ్నాప్ కాదు. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఆ యువతే తనను తీసుకెళ్లిపొమ్మని అతనికి సమాచారం ఇచ్చింది. జానీ మాస్క్ పెట్టుకుని వచ్చి.. ప్రేమించిన అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు. ఈ తర్వాత వాళ్లిద్దరూ గుళ్లో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి వీడియోను యువతి రిలీజ్ చేయడంతో విషయం వెలుగు చూసింది.