Seven dead in series of road accidents at Anantapur and Tirupati: ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి వేర్వేరు చోట్ల ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలంలోని రేకులకుంట దగ్గర అర్ధరాత్రి లారీ, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్లోనే మృతి చెందారు. నార్పలవైపు వెళ్తున్న కారును లారీ వేగంగా ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కారులో మృతిచెందిన నలుగురు యువకులను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతులంతా అనంతపురం జిల్లాకు చెందిన సిండికేట్ నగర్ వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులు స్టాలిన్ నగర్కు చెందిన చాకలి పవన్, శ్రీనివాస్, ముస్తాక్, ఎస్.పవన్గా గుర్తించారు. విషయం తెలుసుకున్న అనంతపురం ఎస్పీ జగదీష్.. రోడ్డు ప్రమాదం జరిగిన ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
మరోవైపు, తిరుపతి జిల్లాలో తెల్లవారుజామున మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. తిరుపతి జిల్లాలోని చిల్లకూరు సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను అతి వేగంతో కారు ఢీకొట్టింది. కంటైనర్ను వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఆ కారు ఏకంగా లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందగా. .మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు
మృతులందరూ నెల్లూరు పట్టణంలోని వనంతోపు ప్రాంతానికి చెందిన భక్తులుగా గుర్తించారు. వీరు తమిళనాడులోని అరుణాచలంకు వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా.. ముందు ఆగి ఉన్న కంటైనర్ను ఢీకొట్టారు. పోలీసులు సమాచారం తెలుసుకొని ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం గాయపడిన వారిని గూడూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.