Bellam Vinayakudu:విశాఖపట్నం కొత్త జాలరి పేటలో బెల్లం వినాయకుడు ఆలయం ఉంది. ఈ గుడిలో స్వామి వారు ప్రత్యేక పూజలు అందుకుంటూ భక్తులు కోరిన కోరికలను తీరుస్తూ ఆనంద గణపతిగా పూజలందుకుంటున్నారు. ఆలయంలో వెలసిన స్వామి వారిని సాక్షాత్తు చంద్రుడి ప్రతిష్టించారని ఇక్కడి ఆలయ పురాణం చెబుతోంది. అన్ని వినాయకుడి విగ్రహాలతో పోలిస్తే ఈ ఆలయంలో వెలసిన స్వామి వారి రూపం ఎంతో భిన్నంగా ఉంటుంది. స్వామి వారి తొండం కుడి వైపుకు తిరిగి ఉంటుంది. ఇక్కడ స్వామివారికి బెల్లం సమర్పించి ఏ కోరిక కోరినా నెరవేరుతుందని పెద్దఎత్తున భక్తులు నమ్ముతుంటారు. . కోరికలు కోరుకునే భక్తులు, అవి తీరిన వెంటనే బెల్లం బుట్టలు తెచ్చి స్వామివారికి మొక్కులు చెల్లిస్తారు. స్వామికి నైవేద్యమూ, భక్తులకు ప్రసాదమూ రెండూ బెల్లమే ఇస్తారు.
బెల్లం వినాయకుడుగా పేరు పొందిన స్వామివారికి చెరుకు గడలతో తయారుచేసిన బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ ఆలయంలో వెలసిన స్వామి వారికి కేరళ తరహాలో తాంత్రిక పూజలందుకుంటాడని అక్కడి పూజారులు చెబుతుంటారు. స్వామివారి విగ్రహం పక్కనే రామలింగేశ్వర విగ్రహం కూడా ఉంది.వినాయక నవరాత్రులలో మాత్రమే కాకుండా ప్రతి బుధవారం భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని స్వామివారికి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తూ స్వామివారి పూజలో పాల్గొంటారు.
ఈ ఆలయాన్ని 10,11 శతాబ్దాల మధ్య చోళులు నిర్మించారని చరిత్రకారులు చెబుతుంటారు. ఆలయం చిన్నదైనా నిర్మాణంలో చోళుల శిల్పకళ ఛాయలు ఇప్పటికీ కనిపిస్తాయి. నిజానికి ఒకప్పుడు విశాఖ సముద్రతీరంలో ఉండేదని చెప్పే వైశాఖి ఆలయానికి అనుబంధంగా ఈ ఆలయాన్ని నిర్మించారట.. అయితే నెమ్మదిగా వైశాఖి ఆలయం సముద్రంలో కలిసిపోయింది. ప్రతి బుధవారం భక్తులతో ఈ గుడి కిటకిటలాడుతూ ఉంటుంది. వినాయక చవితి ఉత్సవాలప్పుడు ఈ గుడికి విశేషసంఖ్యలో భక్తులు వస్తుంటారు.