Flexi war in Ongole: ఏపీలోని ఒంగోలులో ఫ్లెక్సీల వార్ నెలకొన్నది. టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య ఈ రగడ కొనసాగుతున్నది. తమ ఎమ్మెల్యే ఫొటోను ఫ్లెక్సీలో ఏ విధంగా ముద్రిస్తారంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించారు. దీంతో అక్కడ పరిస్థితి కొంతవరకు టెన్షన్ టెన్షన్ గా మారింది.
జనసేన పార్టీలోకి మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేరికను ఆహ్వానిస్తూ మెగా ఫ్యాన్స్ ఒంగోలు పట్టణంలో ఉన్న చర్చి సెంటర్ వద్ద భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కొంత టెన్షన్ వాతావరణానికి ఈ ఫ్లెక్సీనే కారణమయ్యింది. ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సీలో బాలినేనితోపాటు టీడీపీ ఎమ్మెల్యే దామాచర్ల జనార్థన్, ఎంపీ మాగుంట ఫొటోలు కూడా ముద్రించి ఉన్నాయి. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఫ్లెక్సీని తొలగించారు. ఫ్లెక్సీలో టీడీపీ ఎమ్మెల్యే దామాచర్ల ఫొటోను ఏర్పాటు చేయడాన్ని టీడీపీ శ్రేణులు వ్యతిరేకించారు. తొలగించిన ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో స్థానికంగా కొంత టెన్షన్ వాతావరణం నెలకొన్నది.
Also Read: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..
ఇదిలా ఉంటే.. ఇటీవలే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పంపించారు. తనను అధిష్టానం అంతగా పట్టించుకోవడంలేదని, ఇటు జగన్ వ్యవహారం నచ్చడంలేదని, ఈ నేపథ్యంలోనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బాలినేని ప్రకటించిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో గురువారం ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటమిని చవి చూసినా కూడా జగన్ వ్యవహార శైలీలో మార్పు రావడంలేదన్నారు. తాను ఎప్పుడూ కూడా పదవుల కోసం ఆశపడలేదన్నారు. జగన్ ను నమ్మి తాను ఎన్నో ఆస్తులు పోగొట్టుకున్నానంటూ ఈ సందర్భంగా బాలినేని పేర్కొన్నారు. ఈ పరిస్థితులన్నిటి నేపథ్యంలోనే తాను పార్టీని వీడుతున్నట్లు ఆయన చెప్పారు. అనంతరం జనసేన పార్టీలో తాను చేరుతున్నట్లు వెల్లడించారు. మంచిరోజు చూసుకుని పార్టీలో తన అనుచరులతో కలిసి చేరుతానంటూ పేర్కొన్న విషయం తెలిసిందే.
Also Read: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన