Mallikarjun Kharge : బీజేపీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో తీవ్ర దుమారం రేపాయి. ఖర్గే క్షమాపణలు చెప్పాలని రాజ్యసభలో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇందుకు కాంగ్రెస్ నేత ససేమిరా అనడంతో కొంతసేపు సభలో గందరగోళం ఏర్పడింది. ఈ పరిణామాలపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ దన్ఖడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివాదం ఇలా..
రాజస్థాన్లోని అల్వార్లో భారత్ జోడో యాత్ర ర్యాలీలో ఖర్గే వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం కాంగ్రెస్ ఎంతో చేసిందన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీతోపాటు మరెందరో నాయకులు ప్రాణ త్యాగాలు చేశారని గుర్తుచేశారు. బీజేపీ దేశం కోసం కనీసం ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదని వ్యాఖ్యానించారు. అయినాసరే తాము దేశభక్తులమని కాషాయ నేతలు చెబుతారని ఖర్గే సెటైర్లు వేశారు. ఎవరైనా విమర్శిస్తే దేశద్రోహులుగా ముద్ర వేస్తారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీశాయి.
రాజ్యసభలో రగడ
మంగళవారం పార్లమెంట్ ప్రారంభం కాగానే బీజేపీ నేతలు ఖర్గే వ్యాఖ్యలను ప్రస్తావించారు . అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఖర్గే క్షమాపణలు చెప్పాలని రాజ్యసభలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్
డిమాండ్ చేశారు. ఖర్గే వ్యాఖ్యలతో రాజ్యసభలో కొంతసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ నేత క్షమాపణలు చెప్పాలని బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు బల్లలపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వారించినా వెనక్కి తగ్గలేదు. దీంతో ధన్ఖడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఇలాంటి ప్రవర్తన సరికాదన్నారు. కనీసం సభాపతి సూచనలను కూడా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. మనల్ని చూసి 135 కోట్ల మంది ప్రజలు నవ్వుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ వెలుపల జరిగిన ఘటనపై సభలో ఆందోళనలు సరికాదని ధన్ ఖడ్ హితవు పలికారు. మనమేం పిల్లలం కాదని సభ్యులపై మండిపడ్డారు.
తగ్గేదేలే
మరోవైపు కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ వెలుపల చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చ జరగాల్సిన అవసరం లేదన్నారు. దేశ కోసం పోరాడిన వారిని క్షమాపణలు అడుతున్నారా? అని బీజేపీ సభ్యులను ప్రశ్నించారు. ఆ తర్వాత పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. అటు లోక్సభలోనూ బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.