Aishwarya Rajesh: మలయాళం ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ వైరల్గా మారిన సంగతి తెలిసిందే. దీంతో మాలీవుడ్లో మొదలైన నివేదిక సెగ పొరుగు ఇండస్ట్రీల పై కూడా ప్రభావం చూపిస్తోంది. ఈ తరుణంలో పలు ఇండస్ట్రీలోని నటులు ఈ అంశంపై తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోలీవుడ్ నటి ఐశ్వర్య రాజేష్ స్పందిస్తూ ఈ రకంగా చెప్పుకొచ్చారు.. “నేను చిత్ర పరిశ్రమలో 12 సంవత్సరాలుగా కెరీర్ను కొనసాగిస్తున్నాను. కాలానుగుణంగా మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చాలా మార్పులే వచ్చాయి. అయితే సినీ ఇండస్ట్రీలో మాత్రం ఇంకా పలు అంశాలు పరంగా మారాల్సి ఉంది. ప్రత్యేకంగా అవుట్డోర్ షూట్లకు వెళ్లినప్పుడు మహిళలకు సరైన టాయిలెట్ల సౌకర్యం కూడా కల్పించడం లేదు.. నాకు తెలిసి పరిష్కరించాల్సిన మొదటి సమస్య ఇదే.
కనీసం టాయిలెట్స్ కూడా ఉండవు
మూవీలో నేను హీరోయిన్ లేదా ప్రధాన పాత్రలు చేస్తున్నా కాబట్టి.. చిత్ర యూనిట్ నాకు అన్ని సౌకర్యాలతో వ్యానిటీ వ్యాన్ని ఇస్తారు. అయితే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పని చేసే ఇతర మహిళల పరిస్థితి ఏమిటి? కనీస సౌకర్యాలు కూడా లేకపోయినా వాళ్లు సర్దుకుని షూటింగ్ పనులు పూర్తి చేసుకుని తిరిగి వెళుతున్నారు. ఒక మహిళగా, వాళ్ల కష్టాలను చూస్తే బాధేస్తుంది. ముఖ్యంగా ఎక్కువ రోజులు అవుట్ డోర్ షూటింగ్ చేయాల్సి వస్తే వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటికైనా మహిళలు ఎదుర్కుంటున్న ఇలాంటి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నానని చెప్పారు.
Also Read: లైంగిక వేధింపుల కమిటీకి చైర్మన్ గా ఝాన్సీ.. గతంలో ఆమె చేసిన పనులు తెలిస్తే షాకే..?
వాళ్లకు నేనిచ్చే సలహా ఇదే
సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులకు పాల్పడిన వాళ్లకి సరైన శిక్ష పడాలని కోరుకుంటున్నాను. అప్పుడే వాళ్లకి భరోసా కల్పించడంతో పాటు ఇలాంటివి తగ్గించగలం. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో మహిళలకు నేను ఇచ్చే సలహా ఒక్కటే. మీరు ధైర్యంగా ఉండాలి. చొరవ తీసుకోవాలని ఎవరైనా ప్రయత్నిస్తే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు వెంటనే స్పందించాల్సిన అవసరం ఎంతైన ఉందంటూ ఐశ్యర్య రాజేష్ నొక్కి చెప్పారు. దాదాపు ఏడేళ్లపాటు శ్రమించి జస్టిస్ హేమ కమిటీ ఈ లైంగిక వేధింపులు , ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలపై ఓ నివేదికను సిద్ధం చేసింది.
ఇందులో కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు అన్ని సమస్యలపై లోతైన అధ్యయనం చేసి రిపోర్ట్ను ప్రభుత్వానికి అందించింది. ప్రస్తుతం ఇదే తరహా కమిటీని అన్ని చిత్ర పరిశ్రమల్లో ఏర్పాటుచేయాలని నటీనటులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా, కోలీవుడ్లోని నడిగర్ సంఘం (తమిళనాడు నటీనటుల సంఘం) తమిళ సినిమాల్లో లైంగిక వేధింపుల సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి నటి రోహిణి అధ్యక్షత వహిస్తారు. ఇండస్ట్రీలో ఇలాంటి వ్యవహారాలను ఉపేక్షించేదిలేదని ఫిర్యాదులను సైబర్ పోలీసులతో పంచుకోవడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడిన వాళ్లు ఎవరైనా సరే.. తమిళ చిత్ర పరిశ్రమ నుండి ఐదేళ్లపాటు నిషేధిస్తామని తెలిపింది.