Kidnap : తెలంగాణలో మరో యువతి కిడ్నాప్ సంచలనం రేపింది. ఆదిభట్ల కిడ్నాప్ తరహాలోనే సిరిసిల్ల జిల్లాలో ఓ యువకుడు స్నేహితులతో కలిసి వచ్చి కారులో యువతిని ఎత్తుకుపోయాడు. చందుర్తి మండలం మూడపల్లిలో తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
తండ్రి చంద్రయ్యతో కలిసి శాలిని అనే యువతి హనుమాన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా నలుగురు యువకులు కారులో వచ్చారు. ఆ యువతి పట్టుకునేందుకు ఓ యువకుడు ప్రయత్నించగా ఆమె పరుగెట్టేందుకు ప్రయత్నించింది. అయినా సరే ఆమెను పట్టుకుని బలవంతంగా కారులో ఎత్తుకెళ్లాడు. ఆమె తండ్రి అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆయనపై దాడి చేశారు. యువతిని కిడ్నాప్ చేసిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
శాలినికి సోమవారమే ఎంగేజ్మెంట్ అయినట్లు తెలుస్తోంది. మరునాడే ఆమెను యువకుడు కిడ్నాప్ చేయడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆ యువతి మైనర్ గా ఉన్నప్పుడు గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధించాడని తెలుస్తోంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో నిందితుడిపై పోక్సో కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడి జైలుకు వెళ్లొచ్చాడు. అతడే తమ అమ్మాయిని కిడ్నాప్ చేశాడని చంద్రయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. కిడ్నాప్ చేసిన యువకుడ్ని జానేశ్వర్ అలియాస్ జానుగా గుర్తించారు.
కొన్నిరోజుల క్రితం హైదరాబాద్ శివారు ఆదిభట్లలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. తనతో పెళ్లికి నిరాకరిస్తుందన్న కారణంతో మిస్టర్ టీ సంస్థ యజమాని నవీన్ రెడ్డి..వైశాలి అనే యువతిని కిడ్నాప్ చేశాడు. పట్టపగలు వంద మంది యువకులతో కలిసి వెళ్లి ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. ఆ యువతిని ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన పెను సంచలనం రేపింది. పోలీసులు వెంటనే అలెర్ట్ అవడంతో ఆ యువతిని తిరిగి ఇంటికి పంపేశాడు. కొన్నిరోజుల తర్వాత నవీన్ రెడ్డిని పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇదే తరహాలో మరో కిడ్నాప్ జరగడం సంచలనంగా మారింది. తరచూ ఇలాంటి ఘటనలు జరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.