MALLAREDDY : ఐదుగురు ఎమ్మెల్యేల వ్యవహారంపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలపై ఆచితూచిగా మాట్లాడారు. ఈ సమస్యను సామర్యంగా పరిష్కరించాలని యోచనలో మల్లారెడ్డి ఉన్నారు. ఈ ఇష్యూ చాలా చిన్నది అని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ ఎమ్మెల్యేలు తనపై చేసిన వ్యాఖ్యలను మీడియానే పెద్దదిగా చూపిందన్నారు. బీఆర్ఎస్ క్రమశిక్షణ గల పార్టీ అని పేర్కొన్నారు. ఇంటి సమస్యను పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు.
పదవులు ఇచ్చేది సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తప్ప తాను కాదు మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. తాను గాంధేయవాదినని చెప్పుకొచ్చారు. ఎవరితోనూ గొడవ పెట్టుకునే రకం కాదని తేల్చిచెప్పారు. తన జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి మాట్లాడతానని తెలిపారు. అవసరమైతే వాళ్లందరినీ ఇంటికే ఆహ్వానిస్తానన్నారు. కావాలనే కొందరు సమస్యను పెద్దది చేసి చూపిస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు.
పదవుల కేటాయింపు విషయంలో మల్లారెడ్డి వైఖరిపై అధికార పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కడంతో వివాదం రాజుకుంది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం మల్లారెడ్డికి వ్యతిరేకంగా భేటీ అయ్యారు. మంత్రి తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తమ నియోజకవర్గాల్లో తలదూర్చుతున్నారని మండిపడ్డారు. మల్లారెడ్డి ఏకపక్ష వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఆ ఐదుగురు ఎమ్మెల్యే వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో నిప్పు రాజేశాయి. దీనిపై మల్లారెడ్డి ఏవిధంగా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంలో మల్లారెడ్డి ఉన్నారని తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చెబుతున్నాయి. అసలే ఐటీ దాడులతో ఒకవైపు అల్లాడిపోతే..ఇప్పుడు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారింది. దీంతో రాజీ ధోరణిలో మల్లారెడ్డి ముందుకెళుతున్నారు. మరి ఆయన నిజంగా ఎమ్మెల్యేలను తన ఇంటికి ఆహ్వానించి సమస్యను పరిష్కరించుకుంటారా? లేక పోతే అధిష్టానం వద్దే తెల్చుకుంటారా చూడాలి మరి.