Chandhrababu: వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు మరోసారి ఫైరయ్యారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటించారు. నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ పథకాల గురించి ఆయన అక్కడి ప్రజలకు వివరించారు.
అనంతరం ఆయన జగన్ పై మండిపడ్డారు. ‘వైసీపీని భూస్థాపితం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా కూటమికి ఘన విజయాన్ని అందించారు. ప్రజలు 21 మంది ఎంపీలను గెలిపించారు. దాని వల్లే ఢిల్లీలో మన పరపతి పెరిగింది. గతం సీఎం పరదాల చాటున వెళ్లేవారు. అప్పటి సీఎం జగన్ ను చూస్తే ఆశ్చర్యంగా అనిపించేది. ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా?
ప్రతి నెలా మొదటి తేదీనే ఇంటికి వెల్లి పెన్షన్లు అందజేస్తున్నాం. ప్రతి ఒక్కరికీ రూ. 4 వేల పెన్షన్లను పెంచాం. ఒకేసారి రూ. 2 వేల పెన్షన్ పెంచింది టీడీపీ ప్రభుత్వమే. గతంలో కేంద్రం ఇచ్చిన డబ్బులను కూడా వైసీపీ ప్రభుత్వం డైవర్ట్ చేసింది
Also Read: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి
భక్తులు తిరుమల కొండకు వెళ్లడం మానేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా జగన్ కల్తీ చేశాడు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను జగన్ దెబ్బ తీశాడు. వైసాపీ హయాంలో ప్రసాదం బాగుందా? క్షమించరాని నేరం చేసినవారిని వదిలిపెట్టం. తిరుమల లడ్డూలో నాసిరకమైన నెయ్యిని వాడారు. శ్రీవారి ప్రసాదంలో కల్తీ పదార్థాలు వాడారు. వైసీపీ పాలనలో దర్శనాలు, భోజనాలు కూడా సరిగా లేవు’ అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులకు ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. పేదల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకోవాలన్నారు. వారు ఏమైనా ఇబ్బందుల్లో వారికి ఆదుకోవాలని సూచించారు. ప్రతి నెల ఒకటో తేదీన ‘పేదల సేవలో’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల ఇంటి వద్దకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకుని అవసరమైన సాయం అందించాలన్నారు.