Priyanka Gandhi: తెలంగాణ కాంగ్రెస్ లో కల్లోలం ఇంకా సమసిపోలేదు. కమిటీల్లో పదవులు పొందిన టీడీపీ వలస నేతలు రాజీనామా చేసినా.. సీనియర్లు శాంతించలేదు. 20 తేదీన మరోసారి మీటింగ్ కు సిద్ధమవుతున్నారు. ఆదివారం ఏఐసీసీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి నిర్వహించిన భేటీకి సీనియర్లు డుమ్మా కొట్టడంతో విషయం అధిష్టానానికి చేరింది.
కాంగ్రెస్ హైకమాండ్ టి.కాంగ్ సీనియర్ల వివాదం గురించి ఆరా తీసింది. నేరుగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీనే రంగంలోకి దిగారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసినట్టు చెబుతున్నారు. పార్టీ కమిటీల్లో ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. పార్లమెంట్ సమావేశాల తర్వాత ఢిల్లీ వచ్చి మాట్లాడాలని సూచించినట్టు సమాచారం.
మంగళవారం జరపబోయే అసమ్మతి నేతల మీటింగ్ ను వాయిదా వేసుకోవాలని ప్రియాంకగాంధీ కోరినట్టు తెలుస్తోంది. అయితే, కమిటీల కూర్పు, రేవంత్ రెడ్డి తీరుపై ప్రియాంకగాంధీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేశారని అంటున్నారు. అన్నీ విన్న ఆవిడ.. అన్ని అంశాలపై మాట్లాడదామని.. ఢిల్లీకి రావాలని.. చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రియాంక జోక్యంతో ఈ నెల 23న సీనియర్లు హస్తిన వెళ్లనున్నట్టు టాక్.