Khanapur MLA Vedma Bojju Patel: రాహుల్ గాంధీ తలను తీసుకొచ్చిన వారికి రివార్డు ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి రవనీత్ సింగ్ బిట్టు వైఖరిపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా ఐబీ చౌరస్తాలో దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తలను తీసుకొచ్చిన వారికి రివార్డు ఇస్తానన్న రవనీత్ సింగ్ తలను తీసుకొస్తే.. వారికి తన ఆస్తి రాసిస్తానని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిపేరుమీద ఉన్న ఆస్తిని బహుమతిగా ఇస్తానని ప్రకటించారు.
రాహుల్ గాంధీ గురించి రవనీత్ సింగ్ బిట్టు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ గూండాలకు తిండిపెట్టి పోషిస్తోందని విమర్శించారు. కేంద్రమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై ఇంతవరకూ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రిపై బీజేపీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే బొజ్జు పటేల్.
Also Read: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..
బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్.. రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి ఇష్టానుసారం మాట్లాడితే.. తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కేటీఆర్ పై కూడా బొజ్జు పటేల్ విమర్శలు చేశారు. ట్విట్టర్ పక్షి కేటీఆర్ ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటారని, అలాంటి వ్యక్తి ఇప్పుడు పేదల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదన్నారు.