Today Telangana Cabinet Meeting: తెలంగాణ మంత్రి వర్గ సమావేశం శుక్రవారం జరగనుంది. సాయంత్రం 4 గంలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదల కారణంగా నష్టపోయిన అంశాలతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన పరిహారంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే, రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖలకు సంబంధించిన అధికారాలను హైడ్రాకు కల్పించడంపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ, కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలు, ఆరోగ్య శ్రీ కార్డుల జారీ, తెలుగు వర్సిటీకి సురవరం పేరు, కోఠి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ, హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టడానికి మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది.
ప్రధానంగా హైడ్రాకు చట్టబద్ధత తెచ్చే విధంగా ఆర్డినెన్స్ను తీసుకొచ్చేందుకు సమావేశమవుతున్నారు. హైడ్రాకు హోదా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్లు, ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూ సేకరణపై చర్చ జరగనున్నట్లు సమాచారం.
కేబినేట్ భేటీలో పలు అంశాలపై ఆమోదించిన అనంతరం తుది ఆమోదం కోసం ఆర్డినెన్స్ను గవర్నర్కు పంపనున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రధానంగా రైతు భరోసాపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ పథకం అమలుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఉత్కంఠగా మారింది.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతులకు హామీల వర్షం కురిపించింది. రైతు బంధు స్థానంలో రైతు భరోసాతోపాటు మరింత ఆర్థిక సాయం అందించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గత రబీ సీజన్లో అంతకుముందు అమలు చేసిన విధివిధానాలనే అమలు చేసింది.
అయితే, ప్రస్తుతం సెప్టెంబర్ 30తో ఖరీఫ్ సీజన్ ముగియనుంది. కానీ ఇప్పటివరకు రైతు బంధు కానీ రైతు భరోసా పథకం రైతులకు చేరలేదు. ఈ తరుణంలో దీనిపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!
ఇదిలా ఉండగా, తెలంగాణలో అర్హులైన అందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు. డిజిటల్ కార్డు విషయానికొస్తే.. వీటిపై మరోసారి సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే ప్రస్తుతం రేషన్ కార్డు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది.