ysrcp : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్ కు దిగారు. ప్రభుత్వంపై చేసిన విమర్శలపై ఘాటు స్పందించారు.చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును పవన్ చదువుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని సీఎం జగన్ను మళ్లీ అధికారంలోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. చంద్రబాబు ఏజెంట్గా పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని ఆయన ఆలోచన అంతా చంద్రబాబు గురించేనని అన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుపై మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ను నమ్మితే జనసేన శ్రేణులు నట్టేట మునగడం ఖాయమన్నారు. పవన్ కు .. చంద్రబాబుకు చెంచాగిరీ చేయడమే తెలుసనని చురకలు అంటించారు. పవన్ విజిటింగ్ వీసా మీద వచ్చి ఏదో వాగిపోతారని మండిపడ్డారు. 175 సీట్లలో పోటీ చేసే దమ్ము జనసేనకు ఉందా? అని ప్రశ్నించారు. జెండా, అజెండా, సిద్ధాంతం లేని వ్యక్తి పవన్ అని విమర్శించారు. హింసను ప్రేరేపించే వ్యక్తి పవన్ కల్యాణ్ అని మండిపడ్డారు మంత్రి జోగి రమేష్.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రారని మంత్రి రోజా విమర్శించారు. ఎంతసేపు చంద్రబాబుకు వత్తాసు పలికే పవన్.. ప్రజల సమస్యలు ఎలా పట్టించుకుంటారని ప్రశ్నించారు. రెండు చోట్ల ఓడిపోయిన పవన్కు మాట్లాడే అర్హత లేదన్నారు. 2019లో వైఎస్ జగన్ సీఎం అవ్వడు ఇది నా శాసనమన్న పవన్ను ప్రజలు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వలేదని గుర్తుచేశారు. వైఎస్ జగన్ సీఎం అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న వ్యక్తి ఇప్పుడెందుకు రాష్ట్రలో తిరుగుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు.
షూటింగ్ గ్యాప్లో వచ్చి వేళ్లు, చెప్పులు చూపిస్తే ప్రజలు అవే తిరిగి చూపిస్తారని మంత్రి రోజా హెచ్చరించారు. జనసేన అధినేత తన గతాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు. పవన్తోపాటు ఆయన అన్నలను జనం ఓడించారని గుర్తు చేశారు. సొంత ఊర్లలోనే అన్నదమ్ములు చిత్తుగా ఓడిపోయారంటే వాళ్లపై ప్రజలకు నమ్మకం లేదని తెలుసుకోవాలని హితవు పలికారు.
పోలవరంపై పవన్ విమర్శలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రశ్నించకుండా ఏం చేశారని నిలదీశారు. ఐదేళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయి ఈరోజు మాట్లాడుతుంటే జనం నవ్వుతున్నారని అన్నారు.
ఈసారి జనం ఓడిస్తే రాష్ట్రం చుట్టుపక్కలకు కూడా పవన్ కల్యాణ్ రారని రోజా అన్నారు. పార్టీ మూసేసి హైదరాబాద్ వెళ్లిపోతారని తెలిపారు. బీసీల మీద పవన్కు అసలు ప్రేమ లేదన్నారు. పవన్ పక్కన ఆయన అన్న, నాదెండ్ల మనోహర్ తప్ప బీసీలెవరైనా ఉన్నారా? వైసీపీ నేతలను, ప్రభుత్వాన్ని నోటికొచ్చిన్నట్లు మాట్లాడితే పవన్కు ప్రజలే దేహశుద్ధి చేస్తారని రోజా మండిపడ్డారు.