Tirumala Laddu Row: ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో తిరుపతి తిరుమల అగ్రస్థానంలో ఉంటుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు వస్తుంటారు. తలనీలాలు సమర్పించి, గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకుని పునీతులవుతారు. అనంతరం పరమ పవిత్రంగా భావించే స్వామివారి లడ్డూ ప్రసాదం తీసుకుని తిరుగు ప్రయాణం అవుతారు. అలాంటి లడ్డూ చుట్టూ తీవ్ర వివాదం నెలకొన్నది. తిరుమల లడ్డూలో కలపకూడదని పదార్థాలు కలిపారంటూ నివేదికలు బయటకు రావడంతో రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. అధికార, విపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు బురదజల్లుకుంటున్నారు. లడ్డూ పవిత్రతను దెబ్బ తీస్తున్నారంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదం నెలకొన్న నేపథ్యంలో.. అసలు ఈ లడ్డూ తయారీ ఎవరి నిర్ణయం ప్రకారం జరుగుతుంది? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
తిరుమల లడ్డూ తయారీలో 8 మంది కీలక పాత్ర
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ అనేది ఒక్కరి నిర్ణయంతో జరగదు. తిరుపతి తిరుమల పాలక మండలిలోని 8 మంది కీలక వ్యక్తులు తీసుకునే నిర్ణయం ప్రకారం జరుగుతుంది. తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు తీర్మానం లేకుండా ఏ పని జరగదు. వ్యక్తిగత నిర్ణయాలకు అస్సలు తావులేదు. 2019-21 వరకు లడ్డూ తయారీకి తీసుకున్ననిర్ణయాల్లో పలు సబ్ కమిటీలు భాగస్వామ్యం అయ్యాయి. ముఖ్యంగా ఫైనాన్స్ సబ్ కమిటీ కీలక పాత్ర పోషించింది. అప్పుడు దాని చీఫ్ గా మైహోం రామేశ్వరరావు ఉన్నారు. లడ్డూ తయారీకి కావాల్సిన నెయ్యి, నూనె, సుగంధ ద్రవ్యాలు సహా ఇతర పదార్థాలను కొనుగోలు చేసేందుకు పర్చేజ్ కమిటీ ఉంది. దానికి చీఫ్ గా కె పార్థసారధి(ప్రస్తుత ఏపీ మంత్రి) ఉన్నారు. సభ్యులుగా కృష్ణమూర్తి వైద్యనాథన్, ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతి, అనంత్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సంపత్ రవినారాయణ్, ఫైనాన్స్ అఫెన్స్ సీఈవో బాలాజీ భాగస్వామ్యం అయ్యారు. ఈ 8 మందిని నిర్ణయం ప్రకారమే తిరుమలలో లడ్డూ తయారీ జరిగింది.
Also Read: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్లో బయటపడింది ఇదే
లడ్డూ తయారీ మెటీరియల్ తిరుమలకు ఎలా వెళ్తుందంటే?
లడ్డూ తయారీకి కావాల్సి పదార్థాలు కొనుగోలు చేసిన తర్వాత, తిరుపతిలోని టీటీడీ వేర్ హౌస్ కు వెళ్తాయి. వీటి శాంపిల్స్ ను కొండమీద ఉన్న తిరుమలలో గోశాల పక్కన ఉన్న లాబ్ లో టెస్ట్ చేస్తారు. పరీక్షల్లో అన్ని ఒకే అని వచ్చిన తర్వాతే, ఈ మెటీరియల్ ను పైకి తీసుకెళ్తారు. ఆ తర్వాత లడ్డూలను తయారు చేస్తారు. ఇంత ప్రాసెస్ ఉన్న నేపథ్యంలో లడ్డూ తయారీలో యానిమల్ ఫ్యాట్ ఉందని తేలడంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా పక్కా రిపోర్టులు ఇస్తున్న టీటీడీ ల్యాబ్ ఈ యానిమల్ ఫ్యాట్ ను ఎందుకు కనిపెట్టలేకపోయిందని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో కాకుండా భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంగా చూడాలంటున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారని, అలాంటి వారిలో ప్రస్తుత పరిణామాలు లడ్డూ మీద అపనమ్మకం కలిగేలా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో రోజూ సుమారు 5 లక్షల లడ్డూలు తయారు అవుతుండగా, 15వేల కేజీల నెయ్యిని వినియోగిస్తున్నారు.