Ravichandran Ashwin: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో టీమ్ ఇండియాను కష్టాల నుంచి రవిచంద్రన్ అశ్విన్ గట్టెక్కించాడు. అద్భుతంగా సెంచరీ చేయడమే కాదు. నాటౌట్ గా కూడా నిలిచాడు. ఈ సందర్భంగా అధికారిక బ్రాడ్కాస్టర్ జియో సినిమాతో మాట్లాడుతూ రవీంద్ర జడేజా కారణంగానే సెంచరీ చేయగలిగానని అన్నాడు.
తమిళనాడు ప్రీమియర్ లీగ్.. ఆడటం వల్లనే తన బ్యాటింగ్ మెరుగైనట్టు అశ్విన్ తెలిపాడు. అది టీమ్ ఇండియా కష్టకాలంలో ఉపయోగపడిందని చెప్పాడు. నాకెంతో ఇష్టమైన చెన్నై స్టేడియంలో సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.
ఇది నా సొంత మైదానం. ఇక్కడెన్నో మ్యాచ్ లు ఆడాను. ఇక్కడే క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నానని అన్నాడు. అంతేకాదు చెన్నయ్ సూపర్ కింగ్స్ తరఫున ఇక్కడ చాలా మ్యాచ్ లు ఆడినట్టు తెలిపాడు. అందుకే సొంత మైదానంలో, సొంత అభిమానుల ముందు ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమైనదేనని అన్నాడు. ఈ మైదానం చుట్టూ నాకెన్నో మధురానుభూతులు ఉన్నాయి. చివరిసారిగా ఇక్కడ ఆడిన టెస్ట్లో సెంచరీ చేశాను. అప్పుడు రవిశాస్త్రి హెడ్ కోచ్ గా ఉన్నారు. ఇప్పుడు గౌతంగంభీర్ ఉన్నారని అన్నాడు.
అందరిలాగే నేను కూడా అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్లో బాల్ వచ్చినప్పుడు అన్యాపదేశంగా బ్యాట్ను అడ్డుపెడతానని అన్నాడు. ఒకవేళ వదిలేస్తే ఎక్కడైనా ఇన్ స్వింగ్ అయి వికెట్ ఎగిరిపోతుందనే భయం ఉంటుంది. అడ్డుపెడితే టచ్ అయి స్లిప్ లోకి క్యాచ్ రూపంలో వెళుతుంది. అందుకే ఈ తరహా పిచ్లపై దూకుడుగా ఆడటమే ఉత్తమం అని భావించి అలాగే ఆడానని అన్నాడు.
Also Read: టీమిండియాలో గొడవలు…అశ్విన్ ను అవమానించిన గంభీర్..?
అందుకే సెంచరీ కూడా తక్కువ బాల్స్ లోనే చేయగలిగానని అన్నాడు. అయితే రిషబ్ పంత్ కూడా ఇలాగే ప్రయత్నించాడని తెలిపాడు. ఇది ఎర్ర మట్టి తో చేసిన పిచ్ కావడంతో షాట్స్ కొట్టేందుకు అనుకూలంగా ఉంటుందని అన్నాడు. ఒకవైపు తీవ్రమైన ఎండ, మరోవైపు పరుగులు ఎక్కువ చేయడంతో చెమటలు పట్టి చాలా అలసిపోయాను.
195 పరుగుల భాగస్వామ్యాన్ని ఇద్దరం నిర్మించాం. అంటే అందులో కనీసం 100 రన్స్ అయినా అటూ ఇటూ పరుగెత్తి ఉంటామని అన్నాడు. నేను అలసిపోతున్న విషయాన్ని జడేజా త్వరగా పసిగట్టాడు. డగౌట్ నుంచి మాట్లాడితే మంచినీళ్లు తెప్పించాడు. ప్రతిక్షణం గైడ్ చేస్తూ ముందుకు సాగేలా చూశాడు.
టీమ్ ఇండియాలోని అత్యుత్తమ బ్యాటర్లలో జడేజా ఒకడని కితాబిచ్చాడు. ఇక రేపు మ్యాచ్ సాగుతున్నా కొద్ది వికెట్ కఠినంగా మారుతుందని అన్నాడు. అలాగే కొత్త బంతి బౌలర్లకు సహకరిస్తోందని అన్నాడు. రేపు మేం ఫ్రెష్గా బరిలోకి దిగి…మరిన్ని పరుగులు చేయడానికి ప్రయత్నిస్తామని’ అశ్విన్ అన్నాడు.