Mahmud Hasan : పాకిస్తాన్ ను బెంబేలెత్తించి.. రెండు టెస్టుల్లో గెలిచిన బంగ్లాదేశ్ సగర్వంగా ఇండియాలో అడుగుపెట్టింది. అయితే అక్కడ విజయం వెనుక బంగ్లా పేసర్, యువ క్రికెటర్ ఒకడున్నాడు. అతనే హసన్ మహమూద్.
పాక్ తో జరిగిన రెండో టెస్టు.. రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా బౌలింగు చేసి 5 వికెట్లు తీశాడు. అంతేకాదు బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయంలో కీలకపాత్ర పోషించాడు.
ఇప్పుడతడే.. ఇతడు.. హసన్ మహమూద్. ఇండియాతో జరిగిన తొలిటెస్టులో అతిరథులైన రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ వికెట్లు తీసి ఇండియా నడ్డివిరిచాడు. అంతేకాదు శుభ్ మన్ గిల్ వికెట్ కూడా తీసిపారేశాడు. తన బౌలింగు ధాటికి టీమ్ ఇండియా 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
తర్వాత వచ్చిన రిషబ్ పంత్.. వికెట్ల పతనాన్ని కాసేపు ఆపాడు. అయితే తనని కూడా మళ్లీ హసన్ అవుట్ చేశాడు. ఇప్పుడు నెట్టింట జనాలు.. అసలీ హసన్ మహమూద్ ఎవరు అని తెగ వెతికేస్తున్నారు.
Also Read: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్
24 ఏళ్ల హసన్ మహమూద్ ఎవరంటే.. బంగ్లాదేశ్ లోని లక్ష్మీపూర్ తన స్వగ్రామం. 2020లో జింబాబ్వేతో జరిగిన సిరీస్ లో ఆరంగేట్రం చేశాడు. అలా తొలి టీ 20 మ్యాచ్ ఆడాడు. అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకుని వన్డేలు, ఇలా టెస్టు జట్టులో కూడా స్థానం సంపాదించుకున్నాడు.
హసన్ కి..ఇది నాలుగో టెస్టు. నేటి ఇండియా మ్యాచ్ తో కలిపి మొత్తం 18 వికెట్లు తీశాడు. కొత్త బంతితో రెండువైపులా స్వింగ్ చేయగలిగే సత్తా తనకి ఉంది. అందుకనే మ్యాచ్ ప్రారంభంలో మొత్తం ఫీల్టర్లను స్లిప్పుల్లోనే మొహరించి, బంగ్లా కెప్టెన్ మంచి ఫలితాలు రాబడుతున్నాడు. తర్వాత నుంచి బంతి ఎప్పుడైతే పాతబడుతుందో అతను కొంచెం వెనుకపడుతున్నాడు.
ఇకపోతే 22 వన్డేలు ఆడి 30 వికెట్లు తీశాడు. అలాగే 18 టీ 20లు ఆడి 18 వికెట్లు తీశాడు. మొత్తానికి బంగ్లాదేశ్ జట్టుకి టీమ్ ఇండియా ట్రంప్ కార్డు బుమ్రాలా మారాడని అంటున్నారు. మున్ముందు ఇలాగే తను వికెట్లు తీస్తూ ఉంటే, అనతికాలంలోనే అగ్రశ్రేణి బౌలర్ అవుతాడని, క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతాడని అంటున్నారు.