– విదేశాల్లో రాహుల్ వ్యాఖ్యలపై దుమారం
– రాహుల్పై నోరుపారేసుకున్న బీజేపీ నేతలు
– వారిపై చర్యలేవంటూ ప్రధానికి ఖర్గే లేఖ
– ఆ లేఖకు గట్టిగా కౌంటరిచ్చిన బీజేపీ చీఫ్
– మోదీపై మీవాళ్ల మాటల సంగతేంటంటూ నిలదీత
– ‘గతాన్ని మరిచారా’ అంటూ మండిపడ్డ నడ్డా
Mallikarjun Kharge: హస్తిన కేంద్రంగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు లేఖాస్త్రాలు సంధించుకుంటున్నాయి. తమ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీపై కమలం నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ లేఖకు స్పందిస్తూ గురువారం బీజేపీ అధ్యక్షుడు జేపీనడ్డా.. ఖర్గేకు లేఖ రాశారు. అందులో కాంగ్రెస్ పార్టీకి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
అసలు కథ..
ఇటీవల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన అమెరికా పర్యటనలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్లో సిక్కులకు భద్రత లేదని, ఇప్పుడు సిక్కులు తలపాగా ధరించాలన్నా భయపడుతున్నారని వ్యాఖ్యానించటంతో ఆయన వ్యాఖ్యల మీద దుమారం రేగింది. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి మండిపడ్డారు. ఇందిర హత్య తర్వాత 1984లో ఢిల్లీలో సిక్కులను ఊచకోత కోయటంతో కాంగ్రెస్ హస్తముందనే సంగతి రాహుల్ ఎలా మరిచిపోయారంటూ నిలదీశారు. 1984 హింసలో 3000 మంది మరణించారని, పలువురు సిక్కులు ఆ సమయంలో తలపాగాలను తొలగించుకుని, క్లీన్ షేవ్ చేసుకున్నారని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. తర్వాత మరో కేంద్రమంత్రి రవనీత్ సింగ్ బిట్టూ భాగల్పూర్లో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ అసలు భారతీయడే కాదని, అధిక సమయం విదేశాల్లోనే గడుపుతారని విమర్శించారు. వేర్పాటువాదులు మాత్రమే దేశంపై రాహుల్ వ్యాఖ్యలను ప్రశంసిస్తారని ఎద్దేవా చేశారు. దేశానికి అతిపెద్ద శత్రువు, నెంబర్ వన్ టెర్రరిస్ట్ ఆయనేనని నోరుజారారు. మరో బీజేపీ నేత తర్వీందర్ సింగ్ మరో అడుగు ముందుకేసి.. ‘రాహుల్.. నీకూ నీ నాయనమ్మకు పట్టిన గతే పడుతుంది’ అని బహిరంగంగా బెదిరించారు.
ఖర్గే లేఖ సారాంశం
రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని లేఖలో ఖర్గే కోరారు. క్రమశిక్షణ లేని నాయకులను నియంత్రించాలని కోరుతున్నానని.. భారతీయ రాజకీయాలు పతనం కాకుండా ఉండాలంటే తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘ ఒక యూపీ మంత్రి రాహుల్ను నంబర్ వన్ టెర్రరిస్ట్ అన్నాడు. మహారాష్ట్రలోని మీ ప్రభుత్వంలోని శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్… రాహుల్ నాలుక కోస్తే వారికి రూ.11 లక్షల రివార్డును ప్రకటిస్తున్నారు. ఢిల్లీలోని ఓ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాహుల్పై దాడి చేస్తామని బహరంగంగా బెదిరిస్తున్నారు. ఇదంతా చూస్తూ మీరు మౌనంగా ఉండటం సరికాదు’ అని తన లేఖలో ప్రస్తావించారు. భారత సంస్కృతి అహింస, సామరస్యం, ప్రేమకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినదనీ, బ్రిటీష్ పాలనలోనే గాంధీజీ ఈ ప్రమాణాలను రాజకీయాల్లో ముఖ్యమైన భాగంగా చేశారని గుర్తుచేశారు. స్వాతంత్య్రానంతరం అధికార, విపక్షాల మధ్య గౌరవప్రదమైన ఒప్పందాలు కుదిరిన చరిత్ర ఉందని, రాహుల్ మీద జరుగుతున్న దాడితో కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, ఇలాంటి విద్వేషపూరిత శక్తుల వల్లనే గతంలో గాంధీ, ఇందిర, రాజీవ్ వంటి నేతలు ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు.
Also Read: Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్రావు.. పార్టీ మారుతున్నారా..?
గతం మరిచారా?
రాహుల్ గాంధీపై బీజేపీ నేతల వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే నిలదీయటం వింతగా ఉందంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన లేఖలో ప్రస్తావించారు. ఇదే రాహుల్ గాంధీ తల్లి సోనియా.. గతంలో నేటి ప్రధాని మోదీని ‘మృత్యు బేహారి’(మౌత్ కా సౌదాగర్) అని సంబోధించిన విషయాన్ని మల్లికార్జున్ ఖర్గే మరిచిపోయారా? అంటూ నిలదీశారు. ‘కాంగ్రెస్ నేతలు మోదీని వివిధ పేర్లతో పిలవడమే గాకుండా, ఆయన తల్లిదండ్రుల్ని, ఆయన కులాన్నీ అవమానించారు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ అనే ఫెయిలైన ప్రొడక్ట్ను కాంగ్రెస్ పార్టీ మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చి, దానిని బెస్ట్ ప్రోడక్ట్గా ప్రొజెక్ట్ చేస్తోందని ఎద్దేవా చేశారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ అనేది కాపీ పేస్ట్ వ్యవహారంగా మారిందని సెటైర్ వేశారు. దేశం బయట రిజర్వేషన్ల రద్దు గురించి రాహుల్ మాట్లాడి, ప్రజాస్వామ్యాన్ని అత్యంత అవమానానికి గురిచేశారు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీయే ఎమర్జెన్సీ విధించింది. రాజ్యాంగ సంస్థల పరువుకు భంగం కలిగించడమే కాకుండా, వాటిని బలహీన పరిచింది’ అని నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు.