Manchu Manoj Responds On Jani Master Case: ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కడ చూసినా జానీ మాస్టర్ కేసు గురించే చర్చలు జరుగుతున్నాయి. పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఈ విషయంపై స్పందిస్తూ జానీకి శిక్ష పడాలని కోరుకుంటున్నారు. వారితో పాటు పలువురు తోటి కొరియోగ్రాఫర్లు కూడా ఈ విషయంపై స్పందించడానికి ముందుకొస్తున్నారు. ఇక సినీ పరిశ్రమలోనే కాకుండా బయట జరిగే అన్యాయాలను కూడా వెంటనే ఖండించే హీరోల్లో మంచు మనోజ్ ముందుంటారు. అలాంటి హీరో తాజాగా జానీ మాస్టర్ కేసుపై కూడా స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు మంచు మనోజ్.
పారిపోవడం ప్రమాదకరం
‘కెరీర్లో మీరు ఈ స్టేజ్కు రావడానికి ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చూస్తుంటే నాకు బాధగా ఉంది. నిజం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరు తప్పు చేశారో, ఎవరు తప్పు చేయలేదు అనే విషయాలను చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ ధైర్యంగా తన మాటను చెప్పినప్పుడు అది పట్టించుకోకుండా పారిపోవడం అనేది సమాజానికి, రానున్న తరాలకు ప్రమాదకరమైన సందేశం ఇస్తుంది’ అంటూ జానీ మాస్టర్ను, తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలను ఉద్దేశిస్తూ మాట్లాడాడు మంచు మనోజ్. అంతే కాకుండా ఈ కేసు విషయంలో కష్టపడుతున్న పోలీసులకు అభినందనలు తెలిపాడు.
Also Read: అక్కడ గట్టిగా నొక్కింది, భరించలేకపోయా.. లైంగిక వేధింపులపై హీరో షాకింగ్ కామెంట్స్
న్యాయం కోసం పోరాడాలి
‘ఈ కేసు విషయంలో చాలా వేగంగా స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్, బెంగుళూరు పోలీసులకు నా అభినందనలు. చట్టాలు ఎవరూ అతీతులు కాదని మరోసారి నిరూపణ అయ్యింది. జానీ మాస్టర్.. నిజాన్ని ఎదుర్కోండి, పారిపోకండి. ఒకవేళ మీరూ ఏ తప్పు చేయకపోతే న్యాయం కోసం పోరాడండి. మీరు దోషి అయితే అంగీకరించండి’ అంటూ తన స్టైల్లో మెసేజ్ ఇచ్చాడు మంచు మనోజ్. టాలీవుడ్లోని పెద్దలు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఇండస్ట్రీలో ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారు. వాళ్లకు కూడా తన సలహాలు, సూచనలు ఇచ్చాడు మనోజ్.
వారికోసం పోరాటం
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాటిచ్చింది కాబట్టి వెంటనే ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. దానికోసం సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేయడం మంచిది. సినీ పరిశ్రమలో మహిళలు తమ కష్టాలు చెప్పుకునేలా సహాయపడండి. మహిళలు ఒంటరివాళ్లు కాదని, వాళ్ల కష్టాలను వినడానికి సిద్ధమని అందరికీ తెలిసేలా చేయండి. ఇలాంటి పరిస్థితుల్లో అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ నా సపోర్ట్ ఉంటుంది. న్యాయం, గౌరవం అనేవి కేవలం మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపించగలం అని నిరూపిద్దాం. ప్రతీ మహిళ కోసం పోరాడదాం. వారికి అన్యాయం జరగకుండా చూసుకుందాం’ అంటూ పిలుపునిచ్చారు మంచు మనోజ్. ఇక ఈ హీరో చెప్పిన మాటలను చాలామంది నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు.