Death Case : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ అంబేడ్కర్ నగర్లో బాలిక ఇందు (10) అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడింది. బాలిక చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. చిన్నారి మృతిపై అనుమానాలు లేవని శవపరీక్ష నివేదికలో వైద్యులు వెల్లడించినట్లు పేర్కొన్నారు. చెరువులో జారిపడటంతో ఊపిరితిత్తుల్లోకి నీరు చేరినట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు.
ఈ కేసు నేపథ్యం..
డిసెంబర్ 15న పాఠశాలకెళ్లి ఇందు అదృశ్యమైంది. ఆ తర్వాత రోజు బాలిక మృతదేహం అనుమానాస్పదస్థితిలో చెరువులో లభ్యమైంది. జవహర్నగర్ పరిధి ఎన్టీఆర్నగర్కాలనీలో పాత సామగ్రి సేకరిస్తూ జీవిస్తున్న జీడల నరేష్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వారు ముగ్గురు దమ్మాయిగూడలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఆ రోజు ఉదయం చిన్న కుమార్తె ఇందు(10), కుమారుడి(12)ను తీసుకొని తండ్రి నరేష్ బైక్ పై పాఠశాలకు బయలుదేరాడు. పని ఉందంటూ పిల్లలిద్దరిని మధ్యలో దింపి నడిచి వెళ్లమని చెప్పారు. వారు నడుచుకుంటూ బడికెళ్లారు.
కొద్దిసేపటి తర్వాత పుస్తకం మరిచిపోయాను తెచ్చుకుంటానని ఇందు ఒంటరిగా పాఠశాల నుంచి బయటికెళ్లింది. ఉపాధ్యాయుడు విద్యార్థిని రాలేదని గుర్తించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. తల్లిదండ్రులు 100కు సమాచారం ఇచ్చారు.
ఆ రోజు సాయంత్రం వరకూ ఎదురుచూసినా బాలిక ఆచూకీ తెలియలేదు. పోలీసులు రాత్రి 7.30 గంటల సమయంలో డాగ్స్క్వాడ్తో గాలింపు చేపట్టగా.. పాఠశాల నుంచి దమ్మాయిగూడ చెరువు వరకూ వెళ్లాయి. సీసీఫుటేజీలు పరిశీలించగా.. బాలిక గురువారం ఉదయం 9.23గంటల సమయంలో పాఠశాల సమీపం నుంచి ఒంటరిగా వెళ్తున్నట్లు గుర్తించారు. దమ్మాయిగూడ చెరువు మార్గంలో బాలిక పరిగెత్తుకుంటూ వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు విచారణను కొనసాగించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి వైద్యులు.. ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతోనే బాలిక ఇందు మృతిచెందినట్లు నివేదికలో పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు.