Ysrcp Mlas: ఏపీలో ఫ్యాన్ పరిస్థితి ఏంటి? ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోందా? ప్రజలకు తోడుగా ఉండాల్సిన అధినేత ఎందుకు దూరంగా ఉంటున్నారు? గెలిచిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ముఖం చూడలేదా? ఎమ్మెల్యేలు కనిపించలేదంటూ ఆ ప్రాంత ప్రజలు గగ్గోలు పెడుతున్నారా? ఎన్నికల ముందే రంగంలోకి దిగాలని భావిస్తోందా? ఇంతకీ వైసీపీ కోలుకుంటుందా? లేక జెండా పీకేస్తారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడిచిపోయింది. వైసీపీలో ఉలుకులేదు.. పలుకులేదు. సమయం, సందర్భం వచ్చినప్పుడు మీడియా ముందుకొచ్చి అధికార పార్టీపై బురద జల్లి వెళ్లిపోతున్నారు అధినేత. తాడేపల్లి ప్యాలెస్ను బెంగుళూరు ప్యాలెస్కు చక్కర్లు కొడుతున్నారు. అధినేత బాటనే ఎమ్మెల్యేలు అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. మాజీలు సైతం దాన్నే కంటిన్యూ చేస్తున్నారట.
గెలిచిన, ఓడిన నేతలు తమ నియోజకవర్గంలో అందుబాటులో ఉండలేదని అంటున్నారు ఆ ప్రాంత ప్రజలు. మీడియా ముందు వాయిస్ రైజ్ చేసే ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఏపీ నుంచి హైదరాబాద్కు మకాం మార్చేశారు. అక్కడి నుంచే చర్చల్లో పాల్గొంటున్నారు. వైసీపీలో గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి వుంది. మా సమస్యలు తీర్చాలంటూ ఎమ్మెల్యేల వద్దకు వెళ్లినా ఎవరూ కనిపించలేదట. ఫ్యాన్ పార్టీ నేతలను ఎందుకు గెలిపించామంటూ లోలోపల మధన పడుతున్నట్లు కనిపిస్తోంది. మిమ్మల్ని నమ్మి తాము ముగినిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ నేతలు గెలిచిన పదకొండు నియోజకవర్గాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి ఉన్నట్లు కనిపిస్తోంది. పేరుకే ఎమ్మెల్యేలు, డమ్మీలుగా మారిపోయారని అంటున్నారు. మా మొర ఆలకించే వైసీపీ నేతలు లేరని అంటున్నారు. కొద్దో గొప్పో ఉన్న పంచాయితీ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు సైతం కండువాలు మార్చేసుకుంటున్నారు. వారి పనులు చక్కబెట్టుకుంటున్నారు.
ALSO READ: న్యాయం కోసం.. హోంమంత్రి అనితను కలిసిన.. నటి కాదంబరి జత్వానీ
బెజవాడ వరదల విషయంలో స్థానిక వైసీపీ నేతలు కనిపించడం మానేశారు. అధినేత జగన్ వచ్చినప్పుడు వెనుక మేము ఉన్నామంటూ వచ్చారు. ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాత్రమే దర్శనమిచ్చారు. అదీ కూడా సమయం, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే. తాను ఉన్నానంటూ కార్యకర్తలకు భరోసా ఇవ్వలేకపోతున్నారు.
కేడర్ సైతం ఊగిసలాట ధోరణి అవలంభిస్తోంది. రీసెంట్గా జిల్లా, వివిధ విభాగాలకు అధిపతులను నియమించారు జగన్. ఆ నేతలు సైతం హైదరాబాద్ నుంచి సొంతూర్లకు చక్కర్లు కొడుతున్నారట. అలాగని ఓడిపోయిన సీట్ల బలం పెంచుకునే ప్రయత్నం చేయలేదు హైకమాండ్. గెలిచిన నియోజకవర్గాలపై దృష్టి సారించనూ లేదు. దీంతో ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారట.
ఇదే కంటిన్యూ అయితే కేడర్, నేతలు జారిపోవడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే ఆ పదకొండు స్థానాలకు పంగనామాలేనన్న భయం ఆ నేతలను వెంటాడుతోంది. చివరకు జగన్ నియోజకవర్గంలో ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు కలవరం మొదలైంది. మరి దీన్ని జగన్ మోహన్రెడ్డి ఎలా హ్యాండిల్ చేస్తారో వెయిట్ అండ్ సీ.