CM Chandrababu Comments on Tirumala Laddu Viral: తిరుమల శ్రీవారి లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన సంచలన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. ప్రస్తుతం అన్ని మీడియా సంస్థల్లో చర్చ నడుస్తోంది. కొంతమంది చంద్రబాబు వ్యాఖ్యలపై ఆరోపణలు చేస్తుండగా.. మరోవైపు వైసీపీ హయాంలో జరిగింది వాస్తవమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ తరుణంలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. 50 ఏళ్తుగా తిరుమల లడ్డూలో ఉపయోగించే కర్ణాటకకు చెందిన కేఎంఎఫ్కి చెందిన నందిని నెయ్యిని జగన్ రెడ్డి ఎందుకు ఉన్నట్లు ఉండి తొలగించాడో ఇప్పుడు అర్ధమైందా ? అంటూ టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
తిరుపతి లడ్డూ తయారీకి 50 ఏళ్లుగా సరఫరా చేస్తున్న నందిని నెయ్యిని కాదని, తమిళనాడు కంపెనీకి ఎందుకు ఇచ్చాడో, ఇప్పుడు ప్రజలకు తెలిసింది. 50 ఏళ్లుగా నాణ్యతతో కూడిన నందిని నెయ్యిని జగన్ ఎందుకు వద్దు అన్నాడు ? తక్కువ ధరకు నెయ్యి అంటూ, నాణ్యత లేని నెయ్యి తీసుకొచ్చి, తిరుమల లడ్డూకి రుచి లేకుండా చేయడం వెనుక జగన్ రెడ్డి చేసింది కుట్ర కాక మరేంటి ? అంటూ ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు, తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు ఎలా మాట్లాడుతారని ఆరోపించారు. ఏకంగా వేంకటేశ్వరుడికి మచ్చతెచ్చేలా సీఎం మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా ఉపయోగిస్తే.. తక్షణం విచారణ కమిటీ వేయాలని చెప్పారు. దీంతోపాటు సీబీఐ విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. తిరుమలను అపవిత్రం చేసిన నీచులెవరో నిగ్గుతేల్చాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.
అలాగే, లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను టీటీడీ మాజీ చైర్మన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. దీనిపై తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమేనని సవాల్ విసిరారు.
అంతకుముందు, తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు మంగళగిరిలో కూటమి ప్రభుత్వ శాసనసభాపక్ష సమావేశంలో ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారని ఆరోపణలు చేశారు. అలాగే జగన్ హయాంలో తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం పవిత్రతను దెబ్బతీశారని విమర్శించారు. దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలను అపవిత్రం చేయడంతోపాటు తిరుమలలో దుర్మార్గంగా వ్యవహరించిందంటూ మండిపడ్డారు.
ముఖ్యంగా భక్తులకు నాసిరకం లడ్డూలు, నాణ్యతలేని అన్నప్రసాదం పంపిణీ చేసిందంటూ ఆరోపించారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలకు రాష్ట్ర మీడియాతో పాటు దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది.
Also Read: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు.. ఎందుకో తెలుసా?
ఇదిలా ఉండగా, 2021 వరకు నందిని నెయ్యి సరఫరా జరుగుతుండేది. కానీ తర్వాత టెండర్ ప్రక్రియలో పాల్గొనలేదు. యూపీకి చెందిన ఓ కంపెనీ సరఫరా చేసేందుకు అర్హత పొందింది. రూ. 424కేజీ నెయ్యి సరఫరా చేసేందుకు ఒప్పందం కుదరగా.. ఈ ధర గిట్టుబాటు కాలేదనే టెండర్లో పాల్గొనలేదు. ఈ సమయంలోనే టీటీడీ నెయ్యిపై టీడీపీ చేసిన పలు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.