Bhadradri Temple chief priest suspended amid FIR: భద్రాచలం దేవస్థానం ప్రధాన అర్చకుడిగా ఉన్న పొడిచేటి సీతారామానుజాచార్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఏకంగా తన కోడలిపైనే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ఏపీలోని తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
అయితే ఈ విషయాన్ని ఆలయ అధికారులకు తెలియకుండా దాచిపెట్టినట్లు ఆయనపై ఆరోపణలు వెలువడ్డాయి. ఆగస్టు 14న తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆలయ అర్చకుడి కోడలు స్వయంగా ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. గతకొంతకాలంగా తన మామే లైంగిక దాడికి పాల్పడుతున్నారని, అత్తతోపాటు కుటుంబ సభ్యులు కూడా వేధింపులకు గురిచేశారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా రూ.10 లక్షల కోసం వేధించారని వెల్లడించింది.
ఏపీలో కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణలో చర్యలు తీసుకున్నారు. భద్రాది ఆలయ ప్రధాన అర్చకుడితోపాటు ఆయన దత్తపుత్రుడిని తెలంగాణ దేవాదాయ శాఖ అధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఇద్దరితో పాటు మరొకరికి ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే, ఈ కేసులో విచారణ చేయగా.. తన పోలికతోనే ఓ వారసుడిని ఇవ్వాలని కోడలిపై వేధింపులు గురిచేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ మేరకు భద్రాది ప్రధాన అర్చకుడు పొడిచేటి సీతారామానుజాచార్యులతోపాటు దత్తపుత్రుడు, ఆలయ అర్చకుడు పొడిచేటి తిరుమల వెంకట సీతారాంలను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈఓ రమాదేవి వెల్లడించింది.
వివరాల ప్రకారం.. సీతారామనుజాచార్యులకు కుమార్తెలు ఉన్నారు. కుమారులు లేకపోవడంతో బంధువులైన సీతారాంను దత్తత తీసుకున్నారు. 2019లో ఆయనకు తాడేపల్లి గూడెంకు చెందిన ఓ యువతితో వివాహం చేశారు. అయితే వివాహమైన కొన్ని నెలల నుంచే వేధింపులు మొదలయ్యాయని బాధితురాలు వాపోయింది.
సీతారం భార్యను అదనపు కట్నం తీసుకురావాలని అత్తతోపాటు ఆడపడుచుు ఒత్తిడికి గురిచేశారు. రూ.10 లక్షలు తీసుకొస్తేనే ఇంట్లో ఉంటావని బెదిరించారు. దీంతో గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతూ వస్తుండగా.. కొంతకాలానికే మామ కూడ వేధించసాగాడు. ఈ క్రమంలోనే సీతారామానుజాచార్యులు లైంగిక వేధింపులు చేయడంతో ఆమె భర్తకు ఫిర్యాదు చేసింది.
Also Read: ప్రయాణికులు జాగ్రత్త.. మెట్రో ఎక్స్ అకౌంట్ హ్యాక్..క్లిక్ చేస్తే అంతే!
అయితే, భర్త కూడా తండ్రికి సపోర్టుగా మాట్లాడడంతోపాటు బాధితురాలి భర్త.. భార్యతో తన తండ్రికి క్షమాపణ చెప్పించాడు. దీంతో సీతారామానుజాచార్యులు మరింత లైంగిక వేధింపులు గురిచేయడం మొదలుపెట్టాడు. తనకు ఆస్తి చాలా ఉందని, తన పోలికలతోనే వారసుడు రావాలని అంటూ ఒత్తిడి చేసినట్లు బాధితురాలు చెప్పుకొచ్చింది.
రోజురోజుకూ ఒత్తిడి పెరగడంతోపాటు లైంగికంగా వేధింపులు భరించలేక ఆగస్టు 14న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ విషయాన్ని అర్చకులు ఇద్దరూ అధికారులకు తెలియకుండా దాచిపెట్టారు. దీంతో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నిందితులపై చర్యలు తీసుకున్నారు.