Johnny Master arrest : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టార్ పోలీసులకు చిక్కాడు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, హైదరాబాద్కు తరలిస్తున్నారు. దీంతో వేధింపుల కేసు చిక్కుముడి వీడే అవకాశముంది.
టాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై హైదరాబాద్లో లైంగిక వేధింపుల వ్యవహారంలో పోక్సో కింద కేసు నమోదైంది. ఆ తర్వాత ఆయన కనిపించడం మానేశారు. పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు.
చివరకు గతరాత్రి బెంగుళూరులో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్కు ఆయనను తరలిస్తున్నారు. ఇవాళ ఆయనను విచారించి శుక్రవారం న్యాయస్థానం ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.
జానీ మాస్టార్ ఎక్కువగా ఉండే ఉండే నాలుగు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. నెల్లూరు, ముంబై, లడక్, హైదరాబాద్ ప్రాంతాల్లో వాకబు చేశారు. అయితే బెంగుళూరులో జానీ మాస్టార్ తన ఫ్రెండ్ వద్ద ఉన్నట్లు ఎస్ఓటీ పోలీసులకు కచ్చితమైన సమాచారం వచ్చింది. వెంటనే హైదరాబాద్ నుంచి ఓ టీమ్ బెంగుళూరు వెళ్లింది. గురువారం తెల్లవారుజామున ఆయన్ని అదుపులోకి తీసుకుంది. బెంగుళూరు నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చిన తర్వాత నార్సింగి పోలీసులకు అప్పగించనున్నారు.
ALSO READ: జానీ మాస్టర్కు ఎన్నేళ్లు శిక్ష పడుతుందో తెలుసా?
జానీ మాస్టార్ ఎక్కడంటూ మూడురోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ప్రశ్నలు రైజ్ అయ్యాయి. బాధిత మహిళ ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదంటూ రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగా గురువారం బాధితురాలు మహిళా కమిషన్ వద్దకు వెళ్లింది.
తనకు న్యాయం జరగదేమో, కేసును పక్కదారి పట్టించే అవకాశముందని అనుమానాలు వ్యక్తం చేసిందామె. ఆధారాలతోపాటు 40 పేజీలతో కూడిన ఫిర్యాదును అందజేసింది. ఈ నేపథ్యంలో బాధితురాలికి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కోరింది.
జానీ మాస్టార్ దగ్గరకు బాధితురాలి ఎప్పుడు వెళ్లింది? అప్పుడు ఆమె వయస్సు ఎంత? అక్కడికి వెళ్లడానికి ఎవరు కాల్ చేశారు? అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఎప్పుడు జాయిన్ అయ్యింది? ఎక్కడెక్కడ ఆమెని వేధించాడు? అనే విషయాలతో పాటు బాలీవుడ్ సాంగ్కు కోసం ముంబై వెళ్లినప్పుడు వేధింపులకు పాల్పడినట్టు చెప్పుకొచ్చింది.
పోక్సో కింద కేసు నమోదు చేసిన తర్వాత జానీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గడిచిన మూడురోజులుగా తన సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నారట ఆయన. వేధింపుల కేసులో హైదరాబాద్లో ఏం జరుగుతోంది? బాధితురాలు బయటకు వచ్చి ఎవరెవరితో సమావేశం అవుతోంది? అనేదానిపై సమాచారం సేకరించినట్టు సమాచారం.