Rohithreddy : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు ముందు ట్విస్ట్ ఇచ్చారు. తాను విచారణకు హాజరు కాలేక పోతున్నానని ఈడీ అధికారులకు లేఖ పంపారు. ఈడీ తనకు చాలా తక్కువ సమయం ఇచ్చిందని వరుస సెలవులు కావడంతో బ్యాంక్ స్టేట్మెంట్లు, ఇతర డాక్యుమెంట్లు సేకరించలేక పోయానని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. విచారణకు హాజరయ్యేందుకు తనకు ఈ నెల 25 వరకు సమయం ఇవ్వాలని కోరారు.
రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు హాజరవుతారని తొలుత భావించారు. ఇంటి నుంచి ఆయన బయలుదేరగానే ఈడీ కార్యాలయానికే వెళుతున్నారని అందరూ అనుకున్నారు. ఇంతలో ఆ కారు ప్రగతిభవన్ వైపు వెళ్లింది. అక్కడ సీఎం కేసీఆర్ తో రోహిత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈడీ నోటీసులపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ వ్యవహారంలో ఏ విధంగా ముందుకెళ్లాలన్నదానిపై అంతుకుముందే న్యాయ నిపుణులతో చర్చించారని సమాచారం. కేసీఆర్ తో భేటీ తర్వాత సీన్ మారిపోయింది. విచారణ హాజరుకాలేని రోహిత్ రెడ్డి ఈడీ అధికారులకు లేఖ పంపారు.
ఈడీకి లేఖ
డిసెంబర్ 15న బెంగుళూరు డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి ED నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో డిసెంబర్ 19న విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. అయితే ఈడీ విచారణకు మరికొంత సమయం కావాలని రోహిత్ రెడ్డి తన పీఏ శ్రవణ్ కుమార్ ద్వారా లేఖ పంపారు. మరి ఆ లేఖపై ఈడీ అధికారులు ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది.
మళ్లీ అదే వ్యూహం
ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చినప్పుడు అనుసరించిన వ్యూహాన్ని గులాబీ బాస్ ఇప్పుడు రోహిత్ రెడ్డి కేసులో విషయంలో అమలు చేస్తున్నారు. అప్పుడు కూడా తొలుత కవిత సీబీఐ నుంచి నోటీసులు రాగానే సమాధానం చెప్పడానికి సిద్ధమని ప్రకటించారు. విచారణ తేది దగ్గర పడిన సమయంలో సీబీఐ అధికారులకు ట్విస్ట్ ఇచ్చారు. తొలుత డిసెంబర్ 6న కవిత స్టేట్ మెంట్ ను సీబీఐ అధికారులు రికార్డు చేయాల్సిఉంది. అయితే సీబీఐ నుంచి నోటీసులు అందిన తర్వాత కేసీఆర్ తో ప్రగతి భవన్ లో కవిత రెండుసార్లు భేటీ అయ్యి ఆ కేసుపై చర్చించారు. న్యాయనిపుణులను సంప్రదించారు. ఆ తర్వాత సీబీఐకు ట్విస్ట్ ఇచ్చారు.
సీబీఐ చెప్పిన సమయంలో విచారణకు కుదరదని కవిత తేల్చిచెప్పారు. తాను ఆ రోజు అందుబాటులో ఉండనని స్పష్టం చేస్తూ సీబీఐకు లేఖ పంపారు. డిసెంబర్ 11, 12, 14, 15 తేదీల్లో సీబీఐ అధికారులకు అందుబాటులో ఉంటానని ఆఫ్షన్లు ఇచ్చారు. మొత్తం మీద కవిత అందుబాటులో ఉన్న డిసెంబర్ 11న ఆరున్నర గంటలపాటు కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో ఆమె నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఇదే తరహా రోహిత్ రెడ్డి కూడా ఈడీ అధికారులు విచారణకు సిద్ధమైన సమయంలో లేఖ ద్వారా ట్విస్ట్ ఇచ్చారు.