ప్రశాంతంగా పూర్తి
– పక్కా ప్రణాళికతో నిమజ్జనం పూర్తి చేశాం
– అంతా ప్రశాతంగా జరిగింది
– 11 రోజుల్లో లక్ష విగ్రహాల నిమజ్జనం
– సహకరించిన అందరికీ ధన్యవాదాలు
– మీడియాతో సీపీ సీవీ ఆనంద్
Ganesh Idol Immersion: ఈ ఏడాది గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యిందని తెలిపారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. గత ఏడాదితో పోలిస్తే మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ అయిపోయిందని వివరించారు. పక్కా ప్రణాళికతో దీన్ని పూర్తి చేశామని తెలిపారు. నెక్లెస్ రోడ్, ఐమాక్స్ వద్ద ఉన్న గ్రౌండ్స్లో విగ్రహాలకు పార్కింగ్ ఏర్పాటు చేసి సాధారణ ప్రజలకు రూట్ క్లియర్ చేశామని చెప్పారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అనుకున్న సమయానికి పూర్తి అయిందని, ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం రాత్రి 10.30 గంటలకు ఓల్డ్ సిటీలో వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి అయిందన్నారు. హుస్సేన్ సాగర్లో దాదాపు 15 వేల విగ్రహాల నిమజ్జనం జరిగిందన్న సీపీ, కొన్ని వాహనాల బ్రేక్ డౌన్ వల్ల కొంత ఆలస్యం అయిందని తెలిపారు. లేదంటే ఉదయం 7 గంటలకే అంతా పూర్తయ్యేదని చెప్పారు. నిమజ్జనానికి సహకరించిన ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నట్టు చెప్పారు.
Also Read: One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?
వచ్చే ఏడాది అలా చేయొద్దు!
వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం ఒకరోజు సెలవు ఇస్తోంది. కానీ, కొందరు శోభాయాత్రలను సెలవు రోజు అర్ధరాత్రి, తెల్లవారుజామున స్టార్ట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల నిమజ్జనం మరుసటిరోజు సాయంత్రం వరకు జరుగుతోంది. దీనివల్ల ఆలస్యం అవడంతోపాటు సామాన్య ప్రజలకు ఇబ్బంది అవుతోంది. వచ్చే ఏడాది నుంచి అయినా ఈ పద్ధతి మానుకోవాలి. 11వ రోజే నిమజ్జనం పూర్తి చేసేలా తరలి రావాలని కోరారు సీపీ సీవీ ఆనంద్.