Rythubandhu : యాసంగికి సంబంధించి రైతుబంధు సాయం రైతులకు అందించేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ పథకం కింద రూ.7,600 కోట్ల నిధులను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థికమంత్రి హరీశ్రావును ఆదేశించారు. ఆ నిధులను సంక్రాంతి కల్లా రైతుల ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం ప్రారంభిస్తారు.
రైతుబంధు పథకం ద్వారా రైతులకు ఏటా రూ. 10 వేల ప్రభుత్వం అందిస్తోంది. వానాకాలం, యాసంగి సీజన్ ల్లో రూ.5 వేల వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తోంది. ఉచిత విద్యుత్తుతోపాటు రైతు బీమా, సాగు కోసం నేరుగా రైతు ఖాతాలో పెట్టుబడిని జమ చేయడం ద్వారా వ్యవసాయంలో విప్లవాత్మక పరిణామం చోటు చేసుకుందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. నేడు రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా ఎదిగిందన్నారు. దేశంలో రైతుల సంక్షేమానికి, వ్యవసాయ ప్రగతికి బాటలు వేసే దిశగా పక్క రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రాన్ని ప్రభావితం చేస్తున్నామన్నారు.
వివిధ మార్గాల ద్వారా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ. 40 వేల కోట్లను కేంద్రం తొక్కిపెట్టి ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. అయినాసరే రైతుల సంక్షేమం, వ్యవసాయరంగ అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా రైతుబంధు నిధులను సకాలంలో విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ సారి ఎలాంటి కోతలు లేకుండా రైతులకు పూర్తిస్థాయిలో నిధులు జమ చేస్తున్నామన్నారు.
రైతుబంధు దేశానికే ఆదర్శమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. పదో విడతగా రైతుబంధు సాయం కింద 65 లక్షల మందిపైగా రైతుల ఖాతాల్లో రూ.7,600 కోట్లను జమ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం రైతుల ఖాతాల్లో వేయనున్న నిధులతో కలిపి ఇప్పటికి మొత్తం రూ. 66 వేల కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్న మొట్టమొదటి పథకం దేశంలో ఇదేనన్నారు. అన్నం పెట్టే రైతు అప్పులపాలు కాకూడదని, యాచించే స్థితిలో కాదు శాసించే స్థాయిలో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు.