Student Suicide : బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. పోలీసులు కథనం ప్రకారం ఆ విద్యార్థి రాసిన సూసైడ్ నోట్ ఇలా ఉంది. “నా చావుకు నేనే కారణం. నా మానసిక సమస్యే నా చావుకు కారణం. ఏడాది నుంచి మానసికంగా నరకయాతన పడుతున్నా. అమ్మా.. అక్కని బాగా చూసుకో, నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చెయ్యి. పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో చదువుపై ఇంట్రెస్ట్ పోయింది. ఎన్నోసార్లు చనిపోవాలని అనుకున్నా. నన్ను క్షమించు అమ్మ.. అంటూ” బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ భానుప్రసాద్ తన సూసైడ్ నోట్ లో రాశాడని పోలీసులు తెలిపారు.
భానుప్రసాద్ సూసైడ్ లెటర్ లో పేర్కొన్న అంశాలపై అతని కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు చదవలేక ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయినా.. క్యాంపస్ అధికారులు ఎందుకు వెంటనే చెప్పలేదని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల నుంచి ఈ విషయం తెలిసిందన్నారు. విద్యార్థి మరణిస్తే సమాచారం ఇవ్వరా అంటూ ప్రశ్నించారు. మృతదేహం చూస్తే చాలా రోజుల క్రితమే మరణించినట్లు అనిపిస్తోందన్నారు. ఉస్మానియా డాక్టర్లతో పోస్ట్ మార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి ఆత్యహత్యతో బాసర ట్రిపుల్ ఐటిలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ నిబంధనలు, అధికారుల ఒత్తిడి వల్ల భానుప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడినట్లు విద్యార్థులు ఆరోపించారు. రాత్రంతా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఎదుట కూర్చుని ఆందోళన చేపట్టారు. భానుప్రసాద్ సూసైడ్ నోట్ ను బహిర్గతం చేయాలని చలిలో నిరసన తెలిపారు. క్లాసులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
భానుప్రసాద్ రాసిన లేఖ లభించిందని.. అతడు వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని వీసీ వెంకటరమణ తెలిపారు. గతంలోనూ రెండుసార్లు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. భానుప్రసాద్కు తల్లి, చెల్లి ఉన్నారు. అతడి తండ్రి రాములు కూడా నాలుగేళ్ల కిందట ఆత్మహత్య చేసుకున్నారు. రెండు నెలల కిందట కూడా ఓ విద్యార్థి బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకున్నాడు.