MSME Policy 2024: పాలకులు మారినా.. కొన్ని విధానాలు మారవని, పారిశ్రామిక పాలసీలు లేకుండా రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఉన్న శిల్పకళావేదికలో నిర్వహించిన MSME పాలసీ 2024 కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా MSME పాలసీని ఆయన ఆవిష్కరించారు. ఇందులో మహిళలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా సీఎం కొత్తపాలసీ తీసుకొచ్చారని, ఆయన ఆలోచనను అభినందిస్తున్నానని తెలిపారు.
అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. 1994-2004 మధ్య చంద్రబాబు ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చారని, ఆ తర్వాత అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి దానిని కొనసాగించారన్నారు. మంచిపనులు ఎవరు ప్రారంభించినా.. వాటిని కొనసాగిస్తామని పేర్కొన్నారు. 1960లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐడీపీఎల్ వల్ల రాష్ట్రంలో ఫార్మా రంగం వృద్ధి చెందిందని సీఎం పేర్కొన్నారు. మాధాపూర్ లాంటి చిన్న గ్రామం కూడా ఈ రోజున ప్రపంచానికి డెస్టినేషన్ గా మారిందని తెలిపారు. పీవీ నరసింహారావు ఓపెన్ ఎకానమీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పటిష్టతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇప్పుడు పారిశ్రామిక వేత్తలకు తెలంగాణ వడ్డించిన విస్తరిలా ఉందన్నారు. ఫ్యూచర్ సిటీ కోసం వేగంగా అడుగులు వేస్తున్నామని, పరిశ్రమలకు అవసరమైన నీరు, విద్యుత్ నిరంతరాయంగా అందిస్తున్నామని తెలిపారు. మూసీని కూడా ప్రపంచ పర్యాటకులు వచ్చి చూసేలా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే అమెరికా, సౌత్ కొరియా వంటి దేశాల నుంచి సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు వస్తున్నాయని వివరించారు.
Also Read: ఇల్లు గుల్ల.. బయట డొల్ల, ప్రతిపక్షం ఎవరి పక్షం?
ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీఐలను మరింత టెక్నాలజీతో అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అందుకోసం రూ.2,400 కోట్లతో టాటా సంస్థతో కలిసి అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్నిరంగాలు అభివృద్ధి చెందుతున్నా.. వ్యవసాయరంగం మాత్రం ఇంకా వెనుకబడే ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు రుణమాఫీ చేసినా వారి కష్టాలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కుటుంబంలో ఉన్నవారంతా వ్యవసాయాన్నే నమ్ముకోవద్దని, ఇతర రంగాల్లోకి కూడా రావాలని సీఎం సూచించారు. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అనేదే తమ విధానమన్నారు. ఈ ప్రభుత్వం గడీల మధ్య లేదని, అందరి సమస్యలను పరిష్కరించేందుకు సర్కారు కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.