CPI Narayana Visited Flood affected areas in AP: ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక సూచన చేశారు. ఏపీలో కూడా హైడ్రాను ఏర్పాటు చేయాలంటూ ఆయన ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడలోని పాత రాజరాజేశ్వరిపేటలో వరద బాధితులకు చీరలు, దుప్పట్లు, టవల్స్ ను ఆయన బుధవారం పంపిణీ చేశారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక సీపీఐ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడలో సంభవించిన భారీ వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా పరిగణించి, వెంటనే ఆ ప్రకటన చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో విజయవాడ ప్రజలు సర్వం కోల్పోయారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుడమేరు వల్ల ఎప్పుడు వర్షాలు వచ్చినా ఇదే పరిస్థితిని విజయవాడ ప్రజలు చూడాల్సి వస్తుందన్నారు. బుడమేరు విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉండాలన్నారు. వెంటనే బుడమేరును యుద్ధ ప్రాతిపదికన ఆధునీకరించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.
Also Read: ఏలూరులో హాస్టల్ వార్డెన్ దుర్మార్గం.. ఫోటో షూట్ల పేరుతో మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు
వరదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరు హర్షనీయమన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించి వరద బాధితులకు అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం సరిపోదని.. దానిని ఇంకా పెంచి వారికి అందజేయాలన్నారు. ఇటు వరదల కారణంగా నష్టపోయిన విద్యార్థుల విషయంలో కూడా ప్రభుత్వం స్పందించి వారిని కూడా ఆదుకోవాలంటూ ఆయన ప్రత్యేకంగా డిమాండ్ చేశారు. ఏపీలో వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారని, వరదల వల్ల ఏపీ మొత్తం అల్లకల్లోలమైందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం దీనిపై స్పందించి, జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. అదేవిధంగా జాతీయ విపత్తు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి రూ. 10 వేల కోట్లను కేటాయించాలన్నారు. దీంతో ఏపీలో విపత్తులు ఎప్పుడూ సంభవించినా ఆ నిధులను వాడుకోవొచ్చంటూ ఆయన సూచించారు.
Also Read: ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.. ఈ నిర్ణయాలపై ఆమోదం..
బుడమేరును అడ్డగోలుగా ఆక్రమించడం వల్లే వరదలు భారీగా వచ్చి గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి ముంచెత్తాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి ఆక్రమణలకు గురైన చెరువులను కాపాడుతుందన్నారు. రేవంత్ రెడ్డి సర్కారు హైడ్రాను ఏర్పాటు చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా హైడ్రాను ఏర్పాటు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. దీంతో బుడమేరు ఆక్రమణకు గురైన స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవొచ్చన్నారు.