Johnny Master Case : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పుడు పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మరి తాజాగా ఈ కేసులో వచ్చిన అప్డేట్ ఏంటి? ఆయనకు ఎప్పుడు నోటీసులు ఇవ్వబోతున్నారు? అరెస్ట్ చేసే అవకాశం ఉంటే అది ఎప్పుడు జరుగుతుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నోటీసులు ఇవ్వనున్న పోలీసులు
అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించి, చాలాకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగకుండా తనను మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని అతని భార్యతో కలిసి ఇంటికి వచ్చి ఒత్తిడి చేశారని, ఒప్పుకోకపోతే తనపై దాడి చేశారని ఆరోపించి సంచలనం సృష్టించింది. దీంతో ఈ కేసులో నమోదైన లైంగిక వేధింపుల విచారణ స్పీడ్ అందుకుంది. ఇప్పటికే జానీ మాస్టర్ పై 376, 506, 323(2 ) సెక్షన్ల కింద కేసును ఫైల్ చేశారు. దీంతో జానీ మాస్టర్ పై రోజు రోజుకూ వ్యతిరేకత పెరుగుతుంది.
పలువురు సెలబ్రిటీలు సైతం ఈ కేసుపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఇలాంటి వారికి కఠినంగా శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో డెవలప్మెంట్ ఏంటంటే బాధితురాలికి వైద్య పరీక్షలు ముగిశాయి. అనంతరం ఆమెను భరోసా కేంద్రంలో ఉంచి స్టేట్మెంట్ తీసుకున్నారు నార్సింగ్ స్టేషన్ మహిళా పోలీసులు. ఇక బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్, ప్రాథమిక ఆధారాలతో జానీ మాస్టర్ కు నోటీసులు ఇవ్వడానికి నార్సింగ్ పోలీసులు రెడీ అవుతున్నారు. కానీ నిన్న, నేడు పోలీసులు నిమజ్జనం బందోబస్తులో బిజీగా ఉండగా, రేపు జానీ మాస్టర్ కు నోటీసులు పంపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది.
అయోమయంలో జానీ మాస్టర్ కెరీర్…
ఓవైపు ఆరోపణలు, నోటీసులు, అరెస్టు.. మరోవైపు జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయన కెరీర్ డేంజర్ జోన్ లో పడింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ వివాదం లో నిజానిజాలు నెగ్గు తేలే వరకు జానీ మాస్టర్ ను డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఇప్పటికే ఫెడరేషన్ ను ఆదేశించింది. ఓవైపు పోలీసులు, మరోవైపు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్యానల్ ఈ వివాదం పై విచారణ జరుపుతున్నాయి. లైంగిక వేధింపులపై విచారణ జరుపుతున్న ప్యానెల్ లో ఝాన్సీ చైర్ పర్సన్ గా, దామోదర్ ప్రసాద్ సెక్రటరీగా, తమ్మారెడ్డి భరద్వాజ, వివేక్ కూచిబొట్ల, ప్రగతి, మేడపాటి రామలక్ష్మి, సుచిత్ర చంద్రబోస్, లాయర్ కావ్య సభ్యులుగా ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఇక్కడితో శేఖర్ మాస్టర్ కెరీర్ కు ఎండ్ కార్డు పడేలా కనిపిస్తోంది.