Kangana Ranaut| బిజేపీ ఎంపీ, బాలీవుడ్ వివాదాల నటి కంగనా రనౌత్ తాజా సినిమా ‘ఎమర్జెన్సీ’ని మరో వివాదం చుట్టుముట్టింది. తాజాగా ఆమెకు చండీగడ్ కోర్టు నోటీసులు జారీ చేసింది. చండీగడ్ జిల్లా బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ అడ్వకేట్ రవీంద్ర సింగ్ బస్సీ కంగనా రనౌత్ కు వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్ వేశారు.
ఎమర్జెన్సీ సినిమాలో దేశ తొలి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రను కంగనా రనౌత్ పోషించారు. అంతేకాదు ఈ సినిమాకు ఆమె స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమాను జీ స్టూడియోస్, నటి కంగనా రనౌత్కు చెందిన మణికర్ణిక ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఆమె సినిమాలో సిక్కు సామాజిక ప్రజలను అభ్యంతరకంగా చూపించారని, సిక్కులను కృూరులుగా చిత్రీకరించారని చండీగడ్ జిల్లా కోర్టులో కంగానకు వ్యతిరేకంగా పిటీషన్ వేశారు.
ఈ పిటీషన్ ని విచారణ చేసేందుకు కోర్టు అంగీకరించింది. డిసెంబర్ 5, 2024న ఈ పిటీషన్ పై విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. కంగనా ఈ సినిమాకు నిర్మాత కూడా కావడంతో కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఎమర్జెన్సీ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉండగా.. హై కోర్టులో ఇంతకుముందే పంజాబ్, ఢిల్లీలో సిక్కుల ప్రతినిధిగా షిరోమణి అకాలీ దల్ రాజకీయ పార్టీ ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని పిటీషన్ వేసింది. సినిమా ట్రైలర్ లో సిక్కుల సాయుధ పోరాట నాయకుడు భింద్రావాలెని అభ్యంతరకరంగా చూపారని, సిక్కులంటే హింసకు పాల్పడే వారిగా చూపించారని పిటీషన్ లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని వాదించారు.
పంజాబ్ లోని ఫరీద్ కోట్ నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎంపీ సరబ్ జీత్ సింగ్ ఖాల్సా కూడా ఎమర్జెన్సీ సినిమాలో సిక్కులను కృూరులుగా చూపించారని సినిమా విడుదలను నిషేధించాలని పిలుపునిచ్చారు. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లోని సిక్కు సంఘాలు ఎమర్జెన్సీ సినిమాను నిషేధించాలని నిరసన వ్యక్తం చేశాయి.
Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!
దీంతో హైకోర్టులో సెన్సార్ బోర్డు అధికారులు హాజరు కావాల్సి వచ్చింది. ఈ అంశంపై సెన్సర్ బోర్డు అధికారులు మాట్లాడుతూ.. తాము జారీ చేసిన సెన్సర్ సర్టిఫికేట్ ఉపసంహరించుకుంటున్నామని తెలుపుతూ.. సినిమాలోని అభ్యంతకర దృశ్యాలను మరోసారి చూసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో సినిమా విడుదల ఇప్పటికి పలుసార్లు వాయిదా పడింది.
ఈ మొత్తం వ్యవహారంతో సినిమా ప్రొడ్యూసర్, నటి కంగనా రనౌత్ చిక్కుల్లో పడ్డారు. సినిమా విడుదల జాప్యం కావడంతో తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని.. ఫైనాన్స్ తీసుకున్న వాళ్లకు అప్పులు చెల్లించేందుకు ముంబైలోని తన ఇంటికి రూ.32 కోట్లకు విక్రయించేశానని ఆమె ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. ”సినిమాపై వస్తున్న వివాదాలతో నాకు చాలా నిరాశ కలిగింది. ఇలాంటి నేపథ్యంలోనే ఇంతుకు ముందు వచ్చిన ఇందూ సర్కార్ సినిమాను ఎవరూ వ్యతిరేకించలేదు. కానీ నా సినిమాను మాత్రం నిషేధించాలని కుట్ర జరుగుతోంది. సినిమాలో సిక్కులు ఇందిరా గాంధీని చంపారు. దాన్ని నేను మార్చలేను కదా?..” అని వాదించారు.