భారత్ కి వ్యతిరేకంగా ఎప్పుడూ కవ్వింపు చర్యలకు పాల్పడే పాకిస్తాన్ దేశం తరహాలోనే చైనా కూడా మారింది. అందుకని ఈ రెండు దేశాలతో జరిగే ఆటలు చాలా ఉద్వేగంగా ఉంటాయి. ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠతో చూస్తారు. ఈ క్రమంలో జరిగిన హాకీ ఫైనల్ మ్యాచ్ లో 1-0 తేడాతో ఆతిథ్య చైనాను భారత్ మట్టి కరిపించింది. ఆసియా ఛాంపియన్ గా అవతరించింది. దీంతో భారత్ లో సంబరాలు అంబరాన్నంటాయి.
ఇక హోరా హోరీగా సాగిన మ్యాచ్ లో.. చివరి క్వార్టర్ లో డిఫెండర్ జుగ్ రాజ్ గోల్ సాధించి భారత్ కి ట్రోఫీ అందించాడు. దీంతో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ వరుసగా రెండోసారి నిలబెట్టుకుంది. ఓవరాల్ గా చూస్తే ఇప్పటివరకు ఐదు సార్లు భారత్ ట్రోఫీని గెలిచింది.
ఈ దశలో చివరి క్వార్టర్ వచ్చింది. ఇక్కడ గానీ గోల్ కొట్టకపోతే అంతే సంగతి అనుకొని.. ప్రాణం పెట్టి ఆడారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ కి ఒక అవకాశం వచ్చింది. బంతిని అద్భుత రీతిలో తప్పించి డిఫెండర్ జుగ్రాజ్కి అందించాడు. తను క్షణం కూడా ఆలోచించకుండా.. బ్రహ్మాండమైన స్ట్రయిక్తో బంతిని కొట్టాడు. అది కళ్లు మూసి తెరిచేలోగా గోల్ పోస్టులోకి వెళ్లిపోయింది. ఈసారి చైనీస్ గోల్ కీపర్ ఆపలేకపోయాడు. అలా ఉత్కంఠకు తెరపడింది. చివరకి భారత్ విజయాన్ని అందుకుంది. ట్రోఫీని ముద్దాడింది.