Rohit Sharma BIG Statement on Bangladesh Series: భారత్ ను ఓడించాలని బంగ్లాదేశ్ మాత్రమే కాదు.. ప్రతీ దేశం అనుకుంటుందని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇంగ్లండ్ కూడా ఇలాగే ఛాలెంజ్ చేసి బోల్తా పడిందని గుర్తు చేశాడు.
నిజానికి అప్పుడు సీనియర్లు చాలామంది లేరు. కుర్రవాళ్లు, అనుభవం లేనివాళ్లను తీసుకుని ఆడి గెలిచామని అన్నాడు. ఇప్పుడు సీనియర్లందరూ అందుబాటులో ఉన్నారని తెలిపాడు. ఇదొక శుభపరిణామమని అన్నాడు. అయితే గత ఆరు నెలలుగా టెస్ట్ క్రికెట్ కి దూరంగా ఉన్నాం. ఆ ప్రభావం ఉంటుందని అన్నాడు. కాకపోతే టీ 20 ప్రపంచకప్ ఆడాం. అక్కడంతా ప్రతి బాల్ షాట్ కొట్టాలి. ఆ టెక్నిక్ ఉంటుంది. తర్వాత వన్డే ఆడాం. అక్కడ 50 ఓవర్లు ఆడాలి. అదో తీరుగా ఉంటుంది.
ఇప్పుడు ఐదురోజుల టెస్ట్ క్రికెట్ ఆడాలి. ఓపికగా ఆడాలి. ఆటలో మార్పు రావాలి. మైండ్ లో మార్పు రావాలి. షాట్ సెలక్షన్ లో మార్పు రావాలి. దీనికి కొంత టైమ్ పడుతుంది. అయితే దులీప్ ట్రోఫీ కొంతవరకు కుర్రాళ్లకు ఉపయోగపడింది. మిగిలిన వారు సీనియర్లు కాబట్టి.. ఇప్పుడు గ్యాప్ అనేది పెద్ద విషయం కాదని అన్నాడు.
Also Read: బంగ్లాతో తస్మాత్ జాగ్రత్త: గావస్కర్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కి వెళ్లడమే లక్ష్యంగా ప్రతి మ్యాచ్ ఆడతామని అన్నాడు. అక్కడ పాయింట్లు చాలా కీలకం. అవి సాధించాలనే దానిపైనే ఫోకస్ ఉంటుంది. అప్పుడు బంగ్లాదేశ్ అయినా ఆస్ట్రేలియా అయినా గెలుపే లక్ష్యంగా పోరాడతామని అన్నాడు. వ్యూహాలు కూడా బంగ్లాదేశ్ అని ఒకలా, ఆస్ట్రేలియా అని ఒకలా ఉండవని అన్నాడు. దేశం కోసం ఆడే ప్రతి మ్యాచ్ జట్టులోని అందరికీ కీలకమే అన్నాడు.
ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లను గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మాట్లాడుతూ మా తర్వాత టార్గెట్ ఇండియాను ఓడించడమేనని అన్నాడు. ఈ మాటకు రోహిత్ కౌంటర్ ఇచ్చాడు. వాళ్లు మమ్మల్ని ఓడించాలని ముచ్చట పడుతున్నారు. అది నెరవేరే ఛాన్సే లేదని అన్నాడు. అందరూ ఎన్నో అనుకుంటారు. అన్నీ జరగవు కదాని అన్నాడు.