2023 Cricket World Cup : వచ్చే ఏడాది భారత్లో వన్డే వరల్డ్కప్ జరిగేది అనుమానంగా మారింది. ఇక్కడ జరిపే ఉద్దేశం లేకపోతే మరెక్కడైనా మెగా టోర్నీని నిర్వహించుకోమని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పేసింది. ఇంతకీ బీసీసీఐ ఇంత కటువుగా వ్యవహరించడానికి కారణాలేంటి? అంటే… ఒకటే ఒకటి ఉంది.
వరల్డ్కప్ లాంటి మెగా టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే దేశాల క్రికెట్ బోర్డులు… ఆ దేశ ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపులను పొందాలని గతంలో ఐసీసీలో నిర్ణయం తీసుకున్నారు. ఇదే ఇప్పుడు వచ్చే ఏడాది భారత్ లో వన్డే వరల్డ్కప్ నిర్వహణను సందిగ్ధంలో పడేసింది. గతంలో 2016లో దేశంలో T20 వరల్డ్కప్ జరిగినప్పుడు… పన్ను మినహాయింపులు ఇవ్వడానికి భారత ప్రభుత్వం నిరాకరించింది. అప్పటికి ఎలాగోలా దేశంలో ఆ టోర్నీ జరిగేలా బీసీసీఐ తంటాలు పడింది. ఇప్పుడు కూడా పన్ను విషయంలో భారత ప్రభుత్వం మినహాయింపులేవీ ఇవ్వకపోవచ్చని బీసీసీఐ భావిస్తోంది. పైగా… ఈ విషయంలో భారత ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి పురోగతీ లేదు. దీంతో పన్ను చెల్లింపు విషయంలో తాము ఏమీ చేయలేమని, అవసరమైతే టోర్నమెంట్ను భారత్లో కాకుండా ఇతర చోట నిర్వహించుకోవచ్చని ఐసీసీకి స్పష్టం చేసింది… బీసీసీఐ.
వచ్చే ఏడాది అక్టోబర్- నవంబర్ మధ్య భారత్ లో వన్డే వరల్డ్కప్ జరగాల్సి ఉంది. మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇస్తే… మ్యాచ్లను ప్రత్యక్షంగా చూసే అవకాశంతో పాటు… టీమిండియా వరల్డ్కప్ నెగ్గితే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. కానీ… ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే… ఫ్యాన్స్ ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి. ఇప్పుడు దేశంలో టోర్నీ నిర్వహణ అటు భారత ప్రభుత్వం, ఇటు ఐసీసీ చేతుల్లో ఉంది. భారత ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇస్తే ఐసీసీ దేశంలోనే టోర్నీ నిర్వహిస్తుంది. ఒకవేళ పన్ను మినహాయింపులు ఇవ్వకపోయినా ఫరవాలేదని ఐసీసీ అనుకున్నా… భారత్ లోనే వన్డే వరల్డ్కప్ జరుగుతుంది. ఈ రెండింటింలో ఏది తేడా కొట్టినా… వన్డే వరల్డ్కప్ మరో దేశానికి తరలిపోవడం ఖాయం.