Mormugao : భారత నౌకాదళ శక్తిసామర్థ్యాలు మరింత పెరిగాయి. మన నౌకాదళంలోకి మరో యుద్ధనౌక చేరింది. మిసైల్ విధ్వంసక యుద్ధనౌక ‘మర్ముగోవా’ జలప్రవేశం చేసింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఐఎన్ఎస్ మర్ముగోవాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిళ్లై, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు.
దేశీయంగా తయారు చేసిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ..ఐఎన్ఎస్ మర్ముగోవా.
ఐఎన్ఎస్ మర్ముగోవాను భారత్లో తయారైన అత్యంత శక్తిమంతమైన యుద్ధనౌకల్లో ఒకటిగా రాజ్ నాథ్ అభివర్ణించారు. ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికత కలిగిన యుద్ధనౌకల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. ఇందులోని వ్యవస్థలు భవిష్యత్తు అవసరాలనూ తీర్చగలవని అన్నారు. మన స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యానికి ఇది నిదర్శనమని వివరించారు. భవిష్యత్తులో.. ఇతర దేశాలకూ నౌకానిర్మాణాలు చేసిపెడతామని అన్నారు.
యుద్ధనౌక ప్రత్యేకతలు
యుద్ధనౌక పొడవు 163 మీటర్లు
యుద్ధనౌక వెడల్పు 17 మీటర్లు
యుద్ధనౌక బరువు 7400 టన్నులు
గోవాలోని చారిత్రక ఓడరేవు నగరం మర్ముగోవా పేరును ఈ నౌకకు పెట్టారు. అణు, జీవ, రసాయన యుద్ధ పరిస్థితుల్లోనూ ఇది పోరాడగలదు. భారత నౌకాదళం వార్షిప్ డిజైన్ బ్యూరో దేశీయంగా రూపొందించిన నాలుగు క్లాస్ డెస్ట్రాయర్లలో ఇది రెండోది. ఈ యుద్ధనౌకను మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది.
నాలుగు శక్తిమంతమైన గ్యాస్ టర్బైన్లతో నడిచే ఈ యుద్ధనౌక గంటకు 30 నాటికల్ మైళ్ల వేగాన్ని అందుకోగలదు. ఐఎన్ఎస్ మర్ముగోవాలో అధునాతన ఆయుధాలు, సెన్సార్లు ఉన్నాయి. ఆధునిక నిఘా రాడార్తోపాటు ఉపరితలం నుంచి ఉపరితలం, ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులు ప్రయోగించవచ్చు.