వడ్డించేవాడు మనవాడైతే.. ఏ బంతిలో కూర్చున్నా అన్నీ అందుతాయట. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్పై అలాంటి విమర్శలే వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ఆయన అధికారంలోకి రాగానే.. తమ సొంతగూటిని చక్కబెట్టుకొనే ప్రయత్నాలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. జగన్ హయాంలో వైసీపీ పార్టీకి చెందిన ‘సాక్షి’ పత్రికకు బాగానే ఆదాయం సమకూరినట్లు సమాచారం. ఈ మేరకు కొన్ని లెక్కలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో సాక్షి పత్రిక గురించి తెలియనివారుండరు. అది జగన్ పత్రిక కావడంతో.. వైసీపీ అనుకూల వార్తలు రావడం సర్వసాధారణం. అలాగే, జగన్ను ముఖ్యమంత్రిని చేయడంలో ఆ పత్రిక కూడా కీలక పాత్ర పోషించింది. అందుకే, జగన్ ఆ పత్రికకు మేలు చేకూరే పనులు చేపట్టారని, అధికారంలోకి రాగానే.. ప్రభుత్వ ప్రకటనలన్నీ ఆ పత్రికకు దక్కేలా చర్యలు తీసుకున్నారనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఈ సందర్భంగా కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చాయి.
అప్పట్లో రూ.100 కోట్లకు లోపే..
ఒకప్పుడు సాక్షి పత్రిక ఆదాయం రూ.100 కోట్ల వరకు ఉండేదని.. 2019లో జగన్ అధికారంలోకి రాగానే.. లాభాల బాట పట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ప్రకటనల్లో సింహ భాగం ఆ పత్రికకే కేటాయించేవారని, కేవలం జగన్కు సపోర్ట్ చేసే పత్రికలకే లాభం చేకూర్చేవారనే విమర్శలూ లేకపోలేదు. సాక్షి అంటే ప్రభుత్వ పత్రిక అనే విధంగా ప్రభుత్వ ప్రకటనలు ఉండేవనేది ప్రజల మాట. ఇక ఎన్నికల సమయంలో కూడా ప్రకటనల కోసం భారీగానే వెచ్చించారని సమాచారం. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఈ పత్రికకు రూ.403 కోట్ల వరకు ఆదాయం సమకూరినట్లు తెలిసింది. అంటే జగన్ ప్రభుత్వంలో వచ్చాక వారి ఆదాయం సుమారు రూ.300 కోట్ల వరకు పెరిగిందట. పైగా మొత్తాన్ని ఏపీకి ఐదేళ్లలో పెరిగిన అదనపు ఆదాయంతో ముడిపెట్టి మరీ లెక్క వేస్తున్నారు. ఏపీకి పెరిగిన ఆదాయం కంటే.. సాక్షి పత్రికకు పెరిగిన ఆదాయమే ఎక్కువని అంటున్నారు.
Also Read: పెద్ద ప్లానింగే.. అందుకేనా శ్యామలకు ఆ పదవి, ఉచ్చులో చిక్కుకుంటారు జాగ్రత్త!
రాష్ట్ర ఆదాయాన్ని మించిపోయిందా?
క్రిసిల్ అనే గ్లోబల్ ఎనలిటిక్స్, రేటింగ్స్ కంపెనీ నివేదిక ప్రకారం.. జగన్ ప్రభుత్వం ప్రారిశ్రమిక, సేవా రంగాల్లో వెనుకబడిందని వెల్లడైంది. ఏపీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో తెలిసిందే. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. కొత్త రాష్ట్రంలో ఏర్పడే సవాళ్లను ఎదుర్కొంటూ ఏపీకి మంచి ఆదాయాన్నే సమకూర్చగలిగారు. 2014 – 2015 మధ్య ఏపీ ఆదాయం రూ.65,695 కోట్లు ఉండేది. చంద్రబాబు అధికారం కోల్పోయే సమయానికి.. అంటే 2018-19లో ఏపీ ఆదాయం రూ.1,14,684 కోట్లకు చేరింది.
2013-14లో ఉమ్మడి రాష్ట్రం ఆదాయం రూ.1,10,719 కోట్లు. చంద్రబాబు హయాంలో 2014-15లో ఏపీ ఆదాయం రూ.65,695 కోట్లు, కాగా అదే సమయంలో తెలంగాణ ఆదాయం రూ.51,042 కోట్లు. అలాగే, సీఎంగా చంద్రబాబు దిగిపోయిన ఏడాది 2018-19లో ఏపీ ఆదాయం రూ.1,14,684 కోట్లు కాగా తెలంగాణ ఆదాయం రూ.1,01,420 కోట్లు. ఐదేళ్లపాటు తెలంగాణ కంటే ఏపీ ఆదాయమే ఎక్కువ. కొత్తగా విభజన జరిగి, రాజధాని కూడా లేని, అనేక సవాళ్లతో కూడిన రాష్ట్రంలో ఐదేళ్లలో రూ.65,695 కోట్ల ఆదాయాన్ని చంద్రబాబు రూ.1,14,684 కోట్లకి పెంచారు. అంటే సుమారు 48,989 కోట్లకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచారు చంద్రబాబు.
పెరిగింది రూ.290 కోట్లేనా?
ఇక జగన్ అధికారం కోల్పోయే సమయానికి.. రాష్ట్ర ఆదాయం రూ.1,73,963 కోట్లు. దీన్నే సాక్షి పత్రిక అటు తిప్పి ఇటు తిప్పి.. జగన్ హయాంలో భారీగా ఆదాయం పెరిగినట్లు అప్పట్లో వెల్లడించింది. వాస్తవానికి అందులో రూ.1,14,684 కోట్లు చంద్రబాబు హయాంలో క్రియేట్ చేసినవే. జగన్ అధికారంలోకి వచ్చాక పెరిగిన అదనపు ఆదాయం రూ.59,279 కోట్లు.
అయితే, ఇందులో రూ.10 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రెవెన్యూ లోటు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని రూ.16 వేల కోట్ల రెవ్యెన్యూ లోటును భర్తీ చేయాలని నివేదించారు. ఆ మొత్తంలో రూ.10 వేల కోట్లను జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేశారు. దాన్ని మినహాయిస్తే.. జగన్ ప్రభుత్వ హయంలో పెరిగిన మొత్తం ఆదాయం రూ.49,279 కోట్లు. అంటే జగన్ పాలించిన ఐదేళ్లలో రాష్టానికి పెరిగిన అదనపు ఆదాయం రూ.290 కోట్లు మాత్రమే అని తెలుస్తోంది.
దీన్ని బట్టి చూస్తే సాక్షి పత్రికకే ఆదాయం బాగా పెరిగిందని జగన్ను ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు భారతీ సిమెంట్స్ లాభాలు కూడా భారీగానే పెరిగాయని అంటున్నారు. 2021లో దాదాపు రూ.1300 కోట్లు ఉన్న ఆదాయం 2024 నాటికి రూ.2 వేల కోట్లకు పెరిగిందని అంటున్నారు. దీనిపై జగన్ సపోర్టర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.