Ravindra Jadeja Needs 6 Wickets Against Bangladesh To Join Kapil Dev In Special Club: టీమ్ ఇండియా సాధించిన ఎన్నో విజయాల్లో తన వంతు పాత్ర పోషించిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. చరిత్ర స్రష్టించేందుకు 6 వికెట్ల దూరంలో ఉన్నాడు. బంగ్లాదేశ్ తో జరిగే తొలిటెస్టు మ్యాచ్ లో తను సాధిస్తాడని అందరూ అనుకుంటున్నారు.
ఇప్పటికి జడేజా టెస్టు క్రికెట్ లో 294 వికెట్లు తీసుకున్నాడు. మరో 6 వికెట్లు తీస్తే టెస్టుల్లో భారత్ తరఫున 300 వికెట్లు తీసిన తొలి లెఫ్టార్మ్ స్పిన్నర్ గా రికార్డులకి ఎక్కుతాడు. అయితే 300 వికెట్ల క్లబ్ లో తనకన్నా ముందుగా అనిల్ కుంబ్లే (619), అశ్విన్ (516), హర్భజన్ సింగ్ (417) ఉన్నారు. ఇక పేసర్లలో కపిల్ దేవ్ (434), జహీర్ ఖాన్ (311), ఇషాంత్ శర్మ (311) ఉన్నారు. ఈ రకంగా చూస్తే నాలుగో స్పిన్నర్ గా, ఏడో భారత బౌలర్ గా ఉన్నాడు.
ఇవే కాదు..టెస్టుల్లో 300 వికెట్లు, 3000 పరుగులు పూర్తి చేసుకున్న మూడో భారత ఆల్ రౌండర్ గా, ఓవరాల్ గా 11వ ఆల్ రౌండర్ గా రికార్డులకి ఎక్కుతాడు. భారత ఆల్ రౌండర్లలో తనకన్నా ముందు కపిల్ దేవ్ (5248 పరుగులు, 434 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (3043 పరుగులు, 449 వికెట్లు) ఉన్నారు.
Also Read: నీరజ్ చోప్రాని ఫోన్ నెంబర్ అడిగిన అమ్మాయి.. ఏం చేశాడో తెలుసా?
ఇప్పటికే 35 ఏళ్లకు చేరుకున్న రవీంద్ర జడేజా బహుశా వచ్చే ఏడాది జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ తర్వాత మొత్తానికి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంటున్నారు. రాజకీయాల్లోకి వెళ్లిపోవచ్చునని చెబుతున్నారు. అదే జరిగితే తను భారత ఆల్ రౌండర్లలో మూడోవాడిగా ఉండిపోవచ్చునని అంటున్నారు.
ఇకపోతే బంగ్లాదేశ్ తో జరిగే తొలిటెస్టుకు తుది జట్టులో రవీంద్ర జడేజాకు ప్లేస్ కన్ ఫర్మ్ అని అంటున్నారు. అందుకే అక్షర్ పటేల్ ని పక్కన పెట్టారని చెబుతున్నారు. బంగ్లాదేశ్ కూడా ముగ్గురు స్పిన్నర్లతో రంగంలోకి దిగుతోంది. అక్కడ శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో స్పిన్నర్ల ధాటికి టీమ్ ఇండియా తోక ముడిచింది. అందుకే బంగ్లాదేశ్ కూడా అదే వ్యూహంతో టీమ ఇండియాపై దాడిచేసేందుకు రానుందని అంటున్నారు.
ఈ లెక్కన చూసుకుంటే అశ్విన్, కులదీప్, రవీంద్ర జడేజా ఆడవచ్చునని అంటున్నారు. ఇలా జరిగితే తను 6 వికెట్లు తీయడం ఖాయమే అంటున్నారు. లేదంటే రెండో టెస్టులోనైనా రికార్డ్ కొడతాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.